పోలవరం దోపిడి బయటపడింది..బిజెపికి చిత్తశుద్ది ఉందా ? అంటూ టిడిపి, బిజెపిలను వైసిపి నిలదీసింది. వైసిపి వైఖరి చూస్తుంటే ఒకేదెబ్బకు రెండు పిట్టలను కొట్టాలన్నట్లుగా ఉంది. ఈరోజు పార్టీ సినియర్ నేత బొత్సా సత్యానారాయణ మాట్లాడుతూ, ఒకేసారి ఇటు తెలుగుదేశంపార్టీ తో పాటు అటు బిజెపిపైనా మండిపడ్డారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన పోలవరం ప్రాజెక్టు సందర్శన వల్ల చంద్రబాబు నాయుడు చేస్తున్న దోపిడి బయటపడిందన్నారు. అదే సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయటంలో బిజెపి చిత్తశుద్ది కూడా బయటపడిందంటూ ఎద్దేవా చేశారు.
నిర్మాణ వ్యయం ఎందుకు పెరుగుతోంది ?
చంద్రబాబును ఉద్దేశించి బొత్స మాట్లాడుతూ నిర్మాణ వ్యయాలు పదే పదే ఎందుకు మారుతోందో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. తన అవినీతి కోసమే చంద్రబాబు పోలవరాన్ని, పట్టిసీమను వాడుకుంటున్నట్లు ధ్వజమెత్తారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి మొత్తం కేంద్రప్రభుత్వానికి పూర్తిగా తెలుసన్నారు. సిఎం చేస్తున్న దోపిడి తెలిసి కూడా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తోందంటూ మండిపడ్డారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టిడిపి-బిజెపిలు కలిసే డ్రామాలాడుతున్నట్లు బొత్స ధ్వజమెత్తారు.
దొందు దొందే
కేంద్రప్రభుత్వ వైఖరి కూడా చంద్రబాబుకు భిన్నంగా ఏమీ లేదన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వానికి ఎలా అప్పగిస్తారంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తవ్వటానికి ఇవ్వాల్సినంత సహకారాన్ని కేంద్రం ఇవ్వటం లేదంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తిచేస్తారో కేంద్రం స్పష్టంగా చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
చంద్రబాబు చేతకాని తనం
రాష్ట్రాభివృద్ధిగురించి మాట్లాడుతూ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు ఏపి జనాలను మోసం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. గడచిన నాలుగేళ్ళల్లో ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాలేదన్నారు. పైగా ఉన్న పరిశ్రమలలు కూడా చంద్రబాబు నిర్వాకం వల్ల దెబ్బతినేస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అవకాశం వైజాగ్ లోని స్టీల్ ఫ్యాక్టరీ లాంటి పెద్ద పరిశ్రమల వల్లే సాధ్యమవుతోందన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రాకపోవటం కేవలం చంద్రబాబు చేతకాని తనం వల్లేఅంటూ మండిపడ్డారు.