' ఓటుకునోటు కేసులో పట్టుబడ్డ డబ్బు చంద్రబాబునాయుడు ఇచ్చి పంపినదే' ...ఇవి తాజాగా టిడిపి బహిష్కృత తెలంగాణా నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఓటుకునోటు కేసులో చంద్రబాబు ముమ్మాటికీ ముద్దాయే అని తేల్చేశారు. మోత్కుపల్లి వరస చూస్తుంటే చంద్రబాబును వదిలిపెట్టేట్లుగా లేరు. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండటం మరోవైపు మోత్కుపల్లి చంద్రబాబును వెంటాడుతున్నట్లుగా మాట్లాడుతుండటంతో టిడిపి నేతలు ఇబ్బందులు పడుతున్నారు. అదే ఊపులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ద్వారా మోత్కుపల్లి పెద్ద షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
వాగ్దాటి ఉన్న నేత
ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మోత్కుపల్లి మంచి వాగ్దాటి ఉన్న నేతనటంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ సామాజికవర్గం మద్దతు కోసం చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. ఎస్సీల కోసమే ప్రత్యేకంగా ' దళిత తేజం' అనే కార్యక్రమం కూడా ఈమధ్యనే ప్రారంభించారు. అటువంటి సమయంలోనే మోత్కుపల్లిని పార్టీ నుండి చంద్రబాబు బహిష్కరించారు.
సీన్ రివర్స్ అవుతోందా ?
తెలంగాణాకు చెందిన నేతను పార్టీ నుండి బహిష్కరిస్తే ఏమవుతుందిలే అని అనుకుని ఉండొచ్చు. అయితే, సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. ఎప్పుడైతే టిడిపి నుండి చంద్రబాబు తనను బహిష్కరించారో అప్పటి నుండి మోత్కుపల్లి ఏపి విషయాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఎంతైనా చంద్రబాబుతో కలిసి దాదాపు మూడు దశాబ్దాల పాటు కలిసి పార్టీలో పనిచేశారు కదా ? చంద్రబాబు గుట్టుమట్లు మోత్కుపల్లికి తెలీకుండానే ఉంటాయా ? అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకునోటు వ్యవహారంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.
ఓటుకునోటు కేసే హైలైట్ ?
మోత్కుపల్లి ఎక్కడ పర్యటించినా ప్రధానంగా ఓటుకునోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్రనే హైలైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వద్ద దొరికిన డబ్బంతా చంద్రబాబుదేనట. ఆ కేసులో చంద్రబాబే ప్రధానముద్దాయిగా ఆరోపిస్తున్నారు. ఆ కేసు గురించి ప్రస్తావిస్తూనే చంద్రబాబు తనకు ద్రోహం చేశారంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విధానం గురించి కూడా జనాలకు వివరిస్తున్నారు. వైసిపి వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికల సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మోత్కుపల్లి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తిరగాలని నిర్ణయించుకున్నారు. అంటే ఒకవిధంగా చంద్రబాబుపైకి మోత్కుపల్లిని వైసిపినే ప్రయోగిస్తున్నట్లు అర్ధమవుతోంది.