మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటిలోకి చేరిపోయారు. ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగా కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి పిలుపు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పిలుపు మేరకే కిరణ్ బహుశా కాంగ్రెస్ పార్టీలో చేరుంటారు. అదే సమయంలో కిరణ్ రాజకీయ భవిష్యత్తు కూడా నాలుగు రోడ్ల కూడలిలో ఆగిపోయింది. నిజానికి 50 ఏళ్ళ వయస్సులోనే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చాలామందికి ఎదురయ్యే ఇబ్బందే ఇది. అలాగని రాజకీయాలకు దూరంగా ఎంతకాలమని ఉంటారు ? ఇప్పటికే నాలుగేళ్ళు దూరంగా ఉన్నారు. ఏ పార్టీలోనూ చేరలేక, రాజకీయాలకు దూరంగా ఉండలేని పరిస్దితుల్లో రాహూల్ పిలుపు కిరణ్ కు అందివచ్చింది. అందుకనే భవిష్యత్తుపై హామీ తీసుకుని కిరణ్ కాంగ్రెస్ లో చేరారు.
కోమాలో కాంగ్రెస్ పార్టీ
అంత వరకూ బాగానే ఉంది. ప్రస్తుతం ఏపిలో కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి పార్టీకి కిరణ్ ఏవిధంగా ఊపిరులూదగలరో ఎవరికీ అర్ధం కావటం లేదు. తెరవెనుక ఉండి వ్యూహాలు పన్నటంలో కిరణ్ అందవేసిన చెయ్యే అనటంలో అనుమానం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించుకోవటంలో తెరవెనుక కిరణ్ సామర్ధ్యం అందరికీ తెలిసిందే. మరి, తెరముందుకొస్తే పరిస్ధితేంటి ?
కిరణ్ పాలనపై మిశ్రమ స్పందన
సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మూడున్నర సంవత్సరాలున్న కిరణ్ పాలనపై జనాల్లో మిశ్రమస్పందనుంది. అలాగని పాలనలో తన ముద్రనేమీ వేసుకోలేదు. పైగా రాష్ట్ర విభజనను అడ్డుకుంటానంటూ ఎన్నో ప్రతిజ్ఞలు చేసి చివరకు చతికిలపడ్డారు. తర్వాత సమైకాంధ్ర పార్టీ అంటూ ఒక పార్టీని ఏర్పాటు చేసి చతికిల పడ్డారు. ఎవరికీ కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అది కిరణ్ సామర్ధ్యం.
రెడ్లే ఓన్ చేసుకోలేదు
విచిత్రమేమిటంటే, కిరణ్ నాయకత్వాన్ని రెడ్లు కూడా ఏనాడు ఓన్ చేసుకోలేదు. అలాగని జిల్లాలో ఏమన్నా తిరుగులేని నేతా అంటే అదీ కాదు. కేవలం ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నేత. అందుకనే సొంతంగా ఒక పార్టీ పెట్టినపుడు కిరణ్ ను కనీసం జిల్లాలో జనాలు కూడా పట్టించుకోలేదు. ఏదో చెప్పుకోవటానికి తప్ప కిరణ్ లాంటి నేతల వల్ల కాంగ్రెస్ కు వచ్చే ఉపయోగం ఏమిటో కాలమే నిర్ణయించాలి.