ఇదిగో అదిగో అంటూ నాలుగేళ్ళు కాలం గడిపేసి ఎన్నికల ముంగిట మొదలుపెట్టిన అన్న క్యాంటిన్లు మూణ్ణాల ముచ్చటగా ముగిసేట్లే కనిపిస్తోంది. ఎందుకంటే, ఎంతో ఆర్భాటంగా మొదలైన క్యాంటిన్లు మధ్యాహ్నం తర్వాత మూతపడిపోతున్నాయి. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 60 క్యాంటిన్లు ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రారంభమైన క్యాంటిన్లన్నీ కూడా మధ్యాహ్నానికే మూతపడిపోతున్నాయి.
మధ్యాహ్నానికే మూతపడుతున్న క్యాంటిన్లు
మద్యాహ్నం తర్వాత క్యాంటిన్లు ఎందుకు మూసేస్తున్నారంటే భోజనాలు అయిపోతున్నాయట. విచిత్రమేమిటంటే ప్రతీ క్యాంటిన్లోనూ రోజుకు 350 మందికి మాత్రమే భోజనాలు పెట్టమని ఉన్నతాధికారులు ఆదేశించారట. మరి, 350 భోజనాలు అయిపోయిన తర్వాత మూసేస్తున్నారో లేకపోతే ఇతరత్రా కారణాలేంటో తెలీదు కానీ మధ్యాహ్నానికే క్యాంటిన్లు మూత పడుతున్నాయి. ఇది ఎక్కడో జరుగుతున్న విషయం కాదు సాక్ష్యాత్తు విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల నడిబొడ్డునే జరుగుతున్నాయి.
క్యాంటిన్లలో కూడా అవినీతేనా ?
అదే సమయంలో అన్న క్యాంటిన్లలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపణలు మొదలైపోయాయి. ప్రతీ క్యాంటిన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 45 లక్షలు వ్యయం చేసిందట. మరి అంత విలువ చేస్తుందా అంటే అదే నిర్మాణాన్ని రూ. 10 లక్షల్లోనే పూర్తి చేయవచ్చని అంటున్నారు. మొత్తం మీద రెండే గదులుంటున్నాయి ప్రతీ క్యాంటిన్లోను. అంటే రెండు గదుల క్యాంటిన్ కు రూ. 45 లక్షలంటే మరి అందరిలోనూ అనుమానాలు రాక ఏమవుతాయి?
భోజనానికి రూ. 45
పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్లేటు భోజనానికి ప్రభుత్వం రూ. 45 విడుదల చేస్తోంది. అదే సమయంలో తెలంగాణా ప్రభుత్వం మాత్రం 20 రూపాయలే కేటాయించింది. మళ్ళీ రెండు రాష్ట్రాల్లో పెడుతున్న భోజనంలో పెద్దగా తేడా ఏమీ లేదు. మరి ఎందుకు 25 రూపాయల వ్యత్యాసమంటే సమాధానం చెప్పేవారు లేరు. అంటే, పేదలకు భోజనం పేరుతో కూడా టిడిపి పెద్దలు ప్రజాధనాన్ని దోచేస్తున్నారనే ఆరోపణలు మాత్రం బాగా వినిపిస్తోంది.