బీజేపీ.. టీడీపీ.. మధ్యలో రామోజీ.. ఇదొక రాజకీయ ఫార్ములా.. రెండు పార్టీల మధ్య ఏర్పడిన అంతరాన్ని తుంచేసే రాజీ ఫార్ములా.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా పరోక్షంగా శాసించే వారిలో రామోజీ ఒకరిగా చెబుతుంటారు. ఏ రాజకీయ పక్షాల మధ్య విభేదాలు ఏర్పడినా.. రాజీ కుదరాలంటే.. రామోజీ ఉండాల్సిందేనని అంటుంటారు.. తాజాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా శుక్రవారం సాయంత్రం రామోజీరావును రామోజీ ఫిల్మ్సిటీలోని ఆయన నివాసంలో కలవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. పైకి మర్యాద పూర్వకంగా కలిసినట్టు చెబుతున్నా.. ఏదో మతలబు ఉండే ఉంటుందని పలువురు నాయకులు భావిస్తున్నారు. రామోజీ.. టీడీపీ అధినేత చంద్రబాబుల మధ్య సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే.
బీజేపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో రామోజీతో అమిత్షా భేటీ కావడంలో ఆంతర్యం ఏమై ఉంటుందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సయమంలో ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్గడ్కరీతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత చనువుగా ఉన్నట్లే కనిపించింది.. ఎడమొఖం.. పెడమొఖం లేకుండా.. అంతా కలివిడిగా ఉన్నట్లే అనిపించింది అందరికి.. ఒకే రోజు చోటు చేసుకున్న ఈ భేటీలతో బీజేపీ, టీడీపీల మధ్య దెబ్బతిన్న సంసారాన్ని చక్కదిద్దే పని ఏదైనా జరుగుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలిసి ఉంటే.. కలదు సుఖం అనే మంత్రాన్ని బోధించే ప్రయత్నాల్లో భాగంగానే.. రామోజీతో అమిత్ షా భేటీ అయ్యారా..? అనే కోణంలో కూడా టాక్ వినిపిస్తోంది.
నిజానికి.. శుక్రవారం హైదరాబాద్కు వచ్చిన అమిత్షా సొంత పార్టీ కార్యకర్తలతో కూడా కనీసం మాట్లాడకుండా.. ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా.. రామోజీని మార్యదపూర్వకంగా కలవాల్సినంత అవసరం ఏముంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే.. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే... సుమారు గంటకు పైగా అమిత్షా, రామోజీలు భేటీ కావడం.. అందులో కొంతసేపు వీరిద్దరే ఏకాంతంగా మాట్లాడుకోవడం గమనార్హం.. మోడీ సందేశాన్నిఅమిత్ షా మోసుకొచ్చారా..? లేక అమిత్ షాకు రామోజీ సామరస్య మంత్రాన్ని నూరిపోశారా..? అన్న కోణంలోనూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభానికి ముందు.. ప్రధాని మోడీ ముందు వంగివంగి ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తిభావాన్ని చాటుకున్న చిత్రం ఆంధ్రుల కళ్లలో మెదులుతూనే ఉంది. ఏదేమైనా.. రామోజీతో ఎవరైనా నేత భేటీ అయ్యారంటే.. రాజకీయాల్లో ఏదో కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. ఈ విషయం అనేకసార్లు రుజువయింది.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూద్దాం మరి.