ప్రపంచంలో మొన్నటి వరకు థాయ్లాండ్ ఓ గుహలో పన్నెండు మంది బాలురు..ఒక కోచ్ చిక్కుకు పోయారు. జూనియర్ ఫుట్బాల్ జట్టు సభ్యులు గుహ సందర్శనకు వెళ్లి అందులో చిక్కుకుపోయిన పోయారు. గుహలో చిక్కుకుపోయిన వారిని 9 రోజుల తర్వాత గుర్తించిన థాయ్ ప్రభుత్వం వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రపంచం సాయాన్ని కూడా అర్థించింది. వారు క్షేమంగా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రార్థనలు చేశారు. ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు.
మొత్తానికి వీరు విజయవంతంగా 18 రోజుల తర్వాత గుహ నుంచి బయటపడ్డారు. గుహ నుంచి బయటపడిన చిన్నారుల్లో డ్వాంగ్పెచ్ ప్రొంథెప్ (13) అనే బాలుడు తొలిసారి మాట్లాడుతూ గుహలో తాము ఎలా ఉన్నదీ వివరించాడు. గుహలో కి వెళ్లే ముందు ఎలాంటి ప్రమాద సూచికలు కనిపించలేదని..కానీ తీరా గుహలోకి వెళ్లిన తర్వాత అనూహ్యంగా ప్రమాదం ముంచుకు వచ్చిందని..తాము ఎటు వెళ్తున్నామో తెలియని అయోమయ పరిస్థితి వచ్చిందని అన్నాడు. బురదలో చిక్కుకుపోయిన తాము మరింత ఎత్తైన ప్రదేశానికి చేరుకునేందుకు చేతులతో బురదను ఎత్తిపోసినట్టు చెప్పాడు.
దాహం వేస్తుంటే..గుహ పై నుంచి పడుతున్న వర్షపు నీటిని ఒక్కో చుక్కను నోటితో పట్టుకున్నట్టు చెప్పాడు. కాకపోతే..గతంలో పలుమార్లు సందర్శించడం తమకు కలిసి వచ్చిందని చెప్పాడు. ఎక్కడ ఏముందో తెలిసిందని అందుకే తాము కాస్త దైర్యంగా ఉన్నామని అన్నాడు. రెస్క్యూ సిబ్బంది వచ్చే వరకు తాము కూర్చున్న ప్రదేశం చాలా చిన్నదని, అందరూ కూర్చోవడానికి కుదిరేది కాదని వివరించాడు. దీంతో కొందరు కూర్చున్నప్పుడు మరికొందరం నిలబడేవారమని చెప్పాడు.