ప్రజలకు ఎవరి మీద విశ్వాసం ఉందన్న అంశం మీద అజీమ్ప్రేమ్జీ విశ్వవిద్యాలయం (ఏపీయూ), సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించారు. దీనితో ప్రజల నుంచి దిమ్మ తిరిగే ఆన్సర్స్ వచ్చినాయి. ప్రజాస్వామ్యం లో ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉండాలి కానీ ప్రజలు ప్రభుత్వం మీద కంటే దేశ సైన్యం మీద నమ్మకం ఉందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థే అన్నిటికి మంచిది. ఈ వ్యవస్థలో కొన్ని లోపాలున్నప్పటికీ అంతిమంగా ప్రజాతీర్పే కీలకం. అయితే ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని రాజకీయపార్టీలు ఎప్పటికప్పుడు విధ్వంసం చేస్తుండటం వల్ల రాజకీయ వ్యవస్థతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థపై విసుగు చెందారనేది పచ్చి నిజం. ప్రభుత్వం మీద ప్రజలు విశ్వాసం చూపించడం లేదంటే ఆ ప్రభుత్వాలు ఎక్కువ కాలం పాటు మనుగడ సాధించ లేవు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజకీయ పార్టీలపై విశ్వాసం -24శాతం నమోదైంది. ఇది ఎంత ప్రమాదకరమో మాటల్లో చెప్పలేనిది. తిలా పాపం తలా పిడికెడు అనే చందాన ప్రజల అవిశ్వాసానికి అన్ని పార్టీలు బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ అరాచకాలను భరించలేమనే ఉద్దేశంతో 1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి తెలుగు ప్రజలు పట్టంకట్టారు. కాలక్రమంలో కాంగ్రెస్కు అవినీతి, బంధుప్రీతిలో ఏమాత్రం తీసిపోమని టీడీపీ పాలకులు నిరూపించారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు వీటికి ఆద్యుడంటే అతిశయోక్తి కాదు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆయన కుట్ర, వెన్నుపోటు, వంచనలకు ప్రతీకగా నిలిచారు. అంతేతప్ప విశ్వాసానికి ఆయన్ను రోల్మోడల్గా ఏ ఒక్కరూ చెప్పుకోరు.