ఆఖరి బంతి వరకు వెయిట్ చేస్తా.. అంటూ రాష్ట్ర విభజన సమయంలో మతిలేని మాటలతో.. ప్రజల సహనాన్ని పరీక్షించిన మాజీ సీఎం, వైఎస్ విధేయుడుగా పేరు పొందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఏదో ఒక పార్టీలో చేరతాడని ఊహాగానాలు సాగిన ఆయన ఒక్కసారిగా బ్యాక్ టు పెవిలియన్ అంటూ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుంది. విభజన చట్టం అమలవుతుంది.. ప్రత్యేక హో దా, ప్రత్యేక రాయితీలు, వివిధ సంస్థల ఏర్పాటు సాధ్యమవుతాయి- అంటూ తాజాగా ఆయన చెబుతున్న వ్యాఖ్యలు మళ్లీ ఏపీ కాంగ్రెస్ను గందరగోళంలోకి నెట్టేవిగానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పనిచేసిన కిరణ్.. రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ నిర్ణయంతో విభేదించి.. ఆ పార్టీని వీడి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే, తాను స్థాపించిన పార్టీ ద్వారా కనీసం తన నేతలకు డిపాజిట్లు దక్కించుకోలేని నాయకుడు ఇప్పుడు మళ్లీ ఏపీలో కాంగ్రెస్కు ఊపిరి లూదేందుకు రెడీ అయ్యారు.ఈ క్రమంలోనే ఆయన జగన్ టార్గెట్ను తూ.చ.తప్పకుండా అమలు చేస్తాడని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే, ఈ సందర్భంలోనే నల్లారికి రెండు రకాలుగా అగ్ని పరీక్షలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఒకటి సొంత ఇంటిని చక్కదిద్దుకోవడం, రెండు రాష్ట్ర కాంగ్రెస్ను దారిలో పెట్టడం. ఈ రెండూ కూడా నల్లారికి పరీక్షలే కానున్నాయి. చిత్తూరు జిల్లా పీలేరులో ఇప్పటికే టీడీపీ పాతుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకుసాగుతోంది.
నల్లారి కిరణ్ సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని చంద్రబాబు చేరదీశారు. ఆయనకు నామినేటెడ్ పదవి కూడా ఇచ్చారు. ఈ క్రమంలో కిరణ్.. కిశోర్ను వెనక్కి రప్పించడం, పీలేరులో కాంగ్రెస్కు జవసత్వాలు వచ్చేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం అనేది పెద్ద చిక్కు! ఇక్కడ పార్టీని చక్క దిద్దకుండా.. తగుదునమ్మా అంటూ.. రాష్ట్రంలోనే వేరే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తే.. ఆయనకు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న.. ముందు మీ తమ్ముడిని పార్టీలోకి తీసుకురండి! అని!! ఇది జరగకుండా.. కిరణ్.. ఏం చేసినా.. నేతలు ఆయన మాటలకు విశ్వాసం ప్రకటిస్తారని, నమ్ముతారని అనుకునే పరిస్థితి ఉండదు.
ఇక, వైసీపీలో ఉన్న నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీలో ఉన్న వారు గెలుపు గుర్రాలు ఎక్కే రేంజ్కు చేరుకున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్ర వారిలో ఆ భరోసాను నింపుతోంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని వదిలి పెట్టి.. దిక్కు మొక్కు ఉంటుందో ఉండదో కూడా తెలియని కాంగ్రెస్లోకి తిరిగి వస్తారంటే.. అది ఊహించేందుకే కష్టంగా మారింది. ఈ పరిస్థితిలో నల్లారికి వచ్చే రోజులు చాలా కష్టమనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. మరి వీటిని ఎలా ఆయన నెగ్గుకు వస్తారో చూడాలి.