ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు అప్రమత్తంగా ఉండాలనీ, అటు ప్రజలతో, ఇటు క్యాడర్తో సక్రమంగా మెలగాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.. పలువురు నాయకులు తమ తీరును మార్చుకోవడం లేదు.. ఎన్నికల ముంగిట జాగ్రత్తగా మాట్లాడాలని.. చంద్రబాబు చెప్పినా వారు మాత్రం డోంట్కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ పార్టీవర్గాల్లో వినిస్తోంది. తాజాగా... విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) చేసిన వ్యాఖ్యలు పార్టీలో చిచ్చురేపాయి. పార్టీ శ్రేణుల్ని తీవ్ర నిరాశకు గురి చేశాయనే చెప్పాలి. ఏకంగా పలువురు నాయకులు రాజీనామాలకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... శనివారం ఎ.కొండూరులో ఎంపీ కేశినేని శ్రీనివాస్ పర్యటించారు. పార్టీ మండలస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తిరువూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఈసారి ఎ.కొండూరుకు కేటాయించాలని ఎంపీని కోరారు. దీంతో ఆయన ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు. మండలంలో టీడీపీకి మెజార్టీ ఎంత వస్తుందంటూ ఆయన ప్రశ్నించారు. 300 నుంచి 400 ఓట్ల మెజారిటీ వరకు వస్తుందని ఆ నాయకులు, కార్యకర్తలు చెప్పారు.. అయితే వారికి ఆయనొక షరతు విధించారు. 10 వేలు మెజార్టీ తీసుకువస్తేనే ఎ.కొండూరుకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇస్తాననీ. లేకపోతే ఇచ్చేది అని తేల్చిచెప్పడంతో వారు కంగుతిన్నారు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఎంపీ వెళ్లిపోయాక.. మండల నాయకులు, కార్యకర్తలు సమావేశం కావడం గమనార్హం. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పదివేల మెజారిటీ ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. ఎంపీ వ్యాఖ్యలు మండల అధ్యక్షుడిని అసమర్థుడిని చేసేలా ఉన్నాయనీ.. పలువురు కార్యకర్తలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో రాజీనామా చేయాలని మండల అధ్యక్షుడు రమేశ్రెడ్డిపై ఒత్తిడి చేయగా... ఆయన కూడా రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నిజానికి మండలంలో రమేశ్రెడ్డి కీలక నేత. ఆయన మూడు సార్లు మండల అధ్యక్షుడిగా పనిచేశారు. రెండు సార్లు మండల పరిషత్ అధ్యక్ష పదవి టీడీపీకి దక్కడంలో ఆయనదే కీలక పాత్ర. ఇప్పుడు రమేశ్ కనుక రాజీనామా చేస్తే ఆయన వెంట మరి కొంత మంది రాజీనామా చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. దీనిపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఎంపీగా నాని గతంలో కూడా చంద్రబాబు, లోకేశ్ చెప్పినా కొన్ని విషయాల్లో ఓపెన్గానే తన అభిప్రాయం వ్యక్తం చేసి సంచలనం రేపారు. ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే నాని మరోసారి సంచలన వ్యాఖ్యలతో పార్టీలో ముసలం పుట్టించారు. మరి ఈ వివాదానికి ఎలా తెరపడుతుందో ? చూడాలి.