' ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం '.... ఇది భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబటి పురంధేశ్వరి చేసిన తాజా వ్యాఖ్యలు. అసలే రాష్ట్రంలో బిజెపి పరిస్దితి అంతంత మాత్రంగా ఉంది. రాష్ట్రంలోని బిజెపి నేతల్లో ఒక్కరు కూడా ప్రజాకర్షక శక్తి గలవారు లేరు. ఏదో పార్టీ గాలి ఉంటే గెలవగలిగిన వారే కానీ సొంత బలంతో గెలిచేంత శక్త ఉన్న నేతలు దాదాపు లేరనే చెప్పాలి. త్వరలో సాధారణ ఎన్నికలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల కోసమని అన్నీ పార్టీలూ కసరత్తులు మొదలుపెట్టేశాయి.
హోదా పై ప్రకటనలు దేనికి ?
ఇటువంటి నేపధ్యంలోనే బిజెపి నేతల వైఖరని గమనిస్తుంటే అనేక అనుమానలు మొదలయ్యాయి. సొంతపార్టీ నేతలే బిజెపిని దెబ్బ కొట్టేందుకు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అన్న డౌట్ వస్తోంది. లేకపోతే, ప్రత్యేకహోదా అంశానికి రాష్ట్రంలో ఎంత ప్రాధాన్యత ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకహోదా అంశమే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అంశమని ప్రధాన ప్రతిపక్షం వైసిపి ప్రకటించిందంటేనే అర్ధమవుతోంది హోదాకున్న ప్రాధాన్యత. అదే సమయంలో ప్రత్యేకహోదా అంశంపైనే తాము ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు చంద్రబాబునాయుడు కూడా చెప్పుకుంటున్న విషయం అందరికీ తెలిసందే.
కలకలం రేపుతున్న వ్యాఖ్యలు
ఈ నేపధ్యంలో ప్రత్యేకహోదా అంశంపై పురంధేశ్వరి చేసిన తాజా వ్యాఖ్యలు బిజెపిలో కలకలం రేపుతోంది. ప్రత్యేకహోదా ఇవ్వనని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని ఎంఎల్సీ సోము వీర్రాజు లాంటి నేతలు ఒకవైపు చెబుతుంటే, వారి వాదనకు విరుద్దంగా పురంధేశ్వరి ప్రకటించటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. హోదా ఇస్తే ఇవ్వాలి. లేకపోతే కనీసం వచ్చే ఎన్నికల వరకూ మాట్లాడకుండా కూర్చోవాలి. అంతే కానీ ఎన్నికల ముందు హోదా అన్నది ముగిసిన అధ్యాయమని పురంధేశ్వరి ప్రకటించటం దేనికి సంకేతాలు ? బిజెపికి వ్యతిరేకంగా జనాలను రెచ్చ గొట్టటం కాదా అన్న అనుమానాలు సర్వత్రా మొదలయ్యాయి.
చంద్రబాబుపై సిబిఐ విచారణ
ఆమధ్య కూడా పురంధేశ్వరి మరో వ్యాఖ్య చేశారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందని బిజెపి నేతలు ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అవినీతిపై విచారణ చేయించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ కూడా చేస్తున్నారు. అవినీతి అంశాలపై చంద్రబాబుపై విచారణ జరుగుతుందని అందరూ చర్చించుకుంటున్నారు. చంద్రబాబు కూడా స్వయంగా అదే విషయంపై పలు వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
పార్టీని ఏం చేద్దామని అనుకుంటున్నారు ?
ఇటువంటి నేపధ్యంలోనే పురంధేశ్వరి మాట్లాడుతూ, చంద్రబాబు అవినీతిపై సిబిఐ విచారణ జరగదంటూ పెద్ద బాంబే పేల్చారు. ఆ ప్రకటనపై బిజెపిలోని నేతలే ఆశ్చర్యపోయారు. ఇక్కడ కూడా సిబిఐ విచారణ జరుగుతుంటే ఆ మాట చెప్పాలి. లేకపోతే మాట్లాడకుండా కూర్చోవాలి. అంతే కానీ ప్రతిపక్ష నేత అయివుండీ చంద్రబాబుపై విచారణ ఉండదని ప్రకటిస్తే ఏమిటర్దం ? పురంధేశ్వరి ప్రకటనలు చూస్తుంటే బిజెపిని దెబ్బ కొట్టానికే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.