ఎన్నికల సీజన్ దగ్గరకు వచ్చే కొద్దీ వైసీపీలో ఆందోళన ఎక్కువ అవుతోంది. ఒక వైపు పాదయాత్ర పేరుతో పార్టీకి మంచి ఊపు తీసుకొద్దామని ప్రయత్నిస్తున్న జగన్ కి కొత్తగా పుట్టుకొచ్చిన పవన్ పార్టీ చుక్కలు చూపించేలా కడనబడడడంతో జగన్కు ఆందోళన పెరుగుతోంది. గతంలో పవన్ అన్న చిరంజీవి ఎలాగైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓట్లు చీల్చాడో అలాగే ఇప్పుడు పవన్ ఓట్లు చీల్చి టీడీపీకి మేలు చేస్తాడనే ఆందోళన జగన్ లో కనిపిస్తోంది. మొన్నటివరకు పెద్దగా జనసేన ప్రభావం కనిపించకపోవడంతో జగన్ లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీకి మంచి ఊపు కనిపించడంతో కంగారు పడుతున్నాడు.
పవన్ ఉత్తరాంధ్ర పర్యటనలోనూ, సాగరతీరంలో జరిగిన కవాతులోనూ భారీగా జనాలు హాజరుకావడాన్ని వైసీపీ తట్టుకోలేకపోతోంది. జనసేన అధినేత పవన్కల్యాణ్ పర్యటనలు ఉత్తరాంధ్రలో ముగిశాయి. పవన్ పర్యటించిన కొన్ని చోట్ల ప్రజలు పలుచగా కనిపించినా మరికొన్ని చోట్ల ఫర్వాలేదనిపించారు. ఇక సాగరతీరంలో జనసేనాధిపతి కవాతుకు యువత నుంచి మంచి స్పందన వచ్చిందని.. అది తమ కొంప ముంచుతుందేమోనని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. అసలే తాము విశాఖ జిల్లాలో వెనకపడి ఉన్నామని ఈ టైంలో పవన్ పర్యటనకు అక్కడ రోజు రోజుకు పట్టు సాధించడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేన కూడా బలంగా చీల్చుతుందన్న అంచనాలు వైసీపీ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.
గత ఎన్నికలలో తాము అధికారంలోకి రాకపోవడానికి పవన్కల్యాణే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ అనుకుంటున్నారు.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. తమకు ఉన్న సహజసిద్ధమైన ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకే వస్తాయని ఆశలు పెట్టుకుంది వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ ఆ ఆశలు నెరవేర్చేలా కనిపించకపోవడంతో వైసీపీలో కంగారు మొదలయ్యింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్లోనూ కొందరు పవన్ వీరాభిమానులు ఉన్నారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేని చోట తాము పవన్కు మద్దతు ఇస్తామని చెబుతున్నారట! ఇలా ఏ కోణంలో చూసినా వైకాపా ఓట్లకు గండి గొట్టడానికి పవన్ పార్టీ సిద్ధంగా ఉందని వైసీపీకి అర్ధం అయిపోయింది. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ఉత్తరాంధ్రలో టీడీపీ - వైసీపీ మధ్య ఓట్ల తేడా దాదాపు నాలుగుశాతం పైగా ఉంది.. అదే సమయంలో జనసేన కూడా గణనీయంగా ఓట్లను సాధిస్తుందని సర్వే తేల్చింది. ఇప్పుడు ఇదే జగన్ శిబిరంలో ఆందోళన పెంచుతోంది.