వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపి అభ్యర్ధిగా వైసిపి తరపున బివై రామయ్య పోటీ ఖాయమైందా ? ఇపుడీ విషయంపైనే జిల్లాలో చర్చ మొదలైంది. ఈ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా టిడిపి-వైసిపి మధ్యే ఉంటుందని చెప్పటంలో సందేహం అవసరంలేదు. ఒకవైపు టిడిపి అభ్యర్ధిగా ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుకే పోటీ చేస్తుందని ఈమధ్యే నారా లోకేష్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికలు తరుముకొస్తున్న నేపధ్యంలో మరి వైసిపి సంగతేంటి ? ఈ ప్రశ్ననే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు నేతలు ప్రస్తావించారట. దాంతో జగన్ కూడా పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బివై రామయ్య విషయంలో సానుకూలంగా స్పందించారట. దాంతో బివై పోటీ ఖాయమని ప్రచారం మొదలైంది.
పట్టున్న నేత బివై
అధికారంలో ఉన్న టిడిపినే అభ్యర్ధిని ముందుగా ప్రకటించినపుడు ప్రతిపక్ష వైసిపి కూడా అభ్యర్ధి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, బివై ఎప్పటి నుండో వైఎస్ ఫ్యామిలికి బాగా సన్నిహితుడు. అదే సమయంలో నియోజకవర్గ పరిధిలో బిసిలే మెజారిటీ సామాజికవర్గం. బిసిల్లోని వాల్మీకి కులానికి చెందిన బివై సామాజవర్గంలోనే కాకుండా ఇతరత్రా కులాల్లో కూడా పట్టుందని సమాచారం. అదే సమయంలో బుట్టా రేణుక కూడా బిసి సామాజికవర్గానికి చెందిన చేనేత ఉపకులం నేత.
బుట్టాను బ్యానరే గెలిపించింది
పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసిన బుట్టా కేవలం పార్టీ బ్యానర్ పైనే గెలిచారు. అయితే, గెలిచిన కొంతకాలానికే టిడిపిలోకి ఫిరాయించారు. దాంతో బుట్టాపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అదే సమయంలో టిడిపిలోని సీనియర్ నేతలు కూడా బుట్టాను కలుపుకోవటం లేదు. మొత్తం మీద నియోజకవర్గంలో బుట్టా పరిస్ధితి ఏమంతా ఆశాజనకంగా లేదన్నది అర్ధమైపోతోంది. కర్నూలు జిల్లా పాదయాత్ర సమయంలో జగన్ మాట్లాడుతూ, కర్నూలు, అనంతపురం నియోజకవర్గాల్లో ఒకదాన్ని బిసిలకు కేటాయిస్తానని ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగానే కర్నూలు ఎంపిగా వైసిపి తరపున బివై ఖాయమని జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. దాంతో రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులపై దాదాపు ఓ క్లారిటీ వచ్చేసినట్లే.