ఏదో వివాదాస్పద వ్యాఖ్య ఏవరిపైనైనా వేయకుండా ఉండలేని వ్యక్తి నిత్యం వార్తల్లో ఉంటూ జనం నోళ్ళలో నానకపోతే ఈ అనంతపురం ఎంపీగారికి నిద్రపట్టదనుకుంటా. తాజాగా ఆయన తన వ్యాఖ్యలతో సొంత తెలుగుదేశం పార్టీ నేతలనే టార్గెట్ చేశారు. టీడీపీ లోని మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఎందుకూ పనికిరాని వెధవ లంటూ అతి ధారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇక కమ్యూనిస్టులనైతే పెద్ద దొంగవెధవ లంటూ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మర్తాడు క్రాస్ సమీపంలో మంగళవారం రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా, తన స్వంత పార్టీ లోని మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కమ్యూనిస్టు పార్టీల నేతలపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను అసెంబ్లీకి వెళ్లక ముందు నాటి రోజుల్లో తనకు కమ్యూనిస్టులంటే చాలా మంచివారనే అభిప్రాయం ఉండేదని వారితో అసెంబ్లిలో పరిచయమయ్యాక కానీ కమ్యూనిస్టులంత దొంగలు మరెక్కడా లేరని తెలుసుకున్నానని అన్నారు.
ఇక టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం పనికిరాని వెధవలన్నారు. అందుకే ప్రభుత్వపథకాలు సరిగా అమలుకు నోచుకోలేదన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్లో చంద్రన్న బీమా పథకం ఒక్కటి మాత్రమే బాగుందని కితాబిచ్చారు. ఈ విషయాన్ని ధైర్యంగా ముఖ్యమంత్రికి చెప్పే ధమ్ము, తెగువ ఎవరికీ లేదన్నారు. రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం ఎవరికి ఉపయోగమో తనకు అర్థం కావటంలేదన్నారు.
రేషన్ షాపుల్లో కొనుగోలు చేసే బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తున్నారని అన్నారు. జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యలతో అదే వేదికపై ఉన్న టిడిపి ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి తదితర టీడీపీ నేతలు షాక్ తిన్నారు. ‘నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు, ఇచ్చినా తట్టుకోలేడు. సీఎం వల్ల నాకు ఎలాంటి లబ్ధి కలుగ లేదు. నేను మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు సచివాలయంలో ఉన్న వాళ్లంతా నా దగ్గర పనిచేశారు’ అని జేసీ అన్నారు.