మాజీ కాంగ్రేస్ పార్లమెంటు సభ్యుడు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రియమైన ఉండవల్లి అరుణ కుమార్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి షాక్ ఇచ్చారు. వైసిపి ఎంపీలు రాజీనామా చేయడం సరికాదని ఆయన నిర్ద్వందంగా చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన సచివాలయం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన కార్యాలయం ఆహ్వానంపై వచ్చి కలిశారు.
రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడవటంతో ఉండవల్లి చంద్రబాబును కలవడం రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని రేపింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడం వల్లనే వచ్చినట్లు చెప్పిన ఆయన చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు.
రేపట్నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లోలో రాష్ట్ర విభజన ప్రయోజనాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహంపై తాను చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు తెలిపారు. తాను గతంలో రాసిన లేఖలపై చంద్రబాబుతో చర్చించినట్లు ఆయన చెప్పారు.
2014 ఫిబ్రవరి 18వ తేదీన చేసిన విభజన చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. దేశ పార్లమెంట్ ఉభయసభలలో జరిగిన విషయాలపై న్యాయస్థానాలు కల్పించుకోవని, అయితే తాము చట్ట విరుద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనపై కోర్టుకు వెళ్లామని ఆయన చెప్పారు.
అయితే జరగనున్నది కాలమే నిర్ణయించినా 'నారా-ఉండవల్లి సమావేశం' మాత్రం వైసిపి జగన్ కు రాజకీయంగా శరాఘారమేనని, చంద్రబాబుకు మాత్రం సహకారమేనని చెప్పవచ్చు. అలాగే 'వైసిపి ఎంపీలు రాజీనామా చేయడం సరికాదని' ఆయన చేసిన వ్యాఖ్యలు వైసిపికి ఏ రకమైన కష్టాలు తెచ్చిపెట్టనున్నాయో? అని రాజకీయ విశ్లేషకుల వాదన. చంద్రబాబు గారి శకునీయం - కుతంత్రం ఈ విషయంలో మిత్రభేధం రూపంలో కనపడుతూనే ఉందని విఙ్జుల అభిప్రాయం.