ఏపీ బీజేపీ ఇరకాటంలో పడింది. నిన్న మొన్నటి వరకు ఏపీ సీఎం చంద్రబాబుపైన, ఆయన పాలనపైనా నిప్పులు చెరగాలని నిర్ణయించుకున్న నేతలు.. ఇప్పుడు గత రెండు రోజులుగా తలుపుల చాటుకు చేరిపోయారు. ఎవ్వరూ ఒక్కరు కూడా మీడియా ముందుకు రావడం లేదు. పైగా మీడియా మిత్రులు పోన్లు చేసినా.. కూడా తమకు వేరే సొంత పనులు ఉన్నాయంటూ.. తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక, నిత్యం లైవ్ కార్యక్రమాల్లోకి వచ్చే కమలం పార్టీ సీనియర్లు కూడా ఇప్పుడు బిజీ బిజీ అంటూ ముఖం చాటు చేస్తున్నారట. ఈ మొత్తం వ్యవహారం రెండు రోజుల్లోనే ఇలా తయారవడానికి కారణాలు ఏంటి? చంద్రబాబుపై దుమ్మెత్తి పోయాలనుకున్న నాయకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడానికి రీజన్ ఏంటి?
ఇప్పుడు ఇవే అంశాలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మేధావుల మెదళ్లకు పదును పెడుతున్నాయి. మరో పదిమా సాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీకి, కేంద్రంలో పార్లమెంటుకు కూడా ఒకే సారి ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టిన బీజేపీ.. నాలుగు అసెంబ్లీ స్థానాలను, ఒక ఎంపీ సీటును దక్కించుకుంది. అయితే, ఇప్పడు బీజేపీతో టీడీపీకి చెడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి బీజేపీ సిద్ధమవుతోంది. ఏపీ బీజేపీ అధినేత కన్నా లక్ష్మీనారాయణ లెక్కలు, అంచనాల ప్రకారం.. ఏపీలోని 175 స్థానాల్లోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేయనుందని స్పష్టం అవుతోంది. అయితే, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? ఓట్లు వేయమని ఎలా అడగాలి? అనే అంశాలపై రాష్ట్రస్థాయి నేతలు పెద్ద చిట్టానే తయారు చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదని, కేంద్రం ప్రాజెక్టుల(పోలవరం) విషయంలోనూ చంద్రబాబు వేలుపెట్టి నిధులు బొక్కేశారని కన్నా విమర్శించారు. ఇక, సోము వీర్రాజు మరో అడుగు ముందుకు వేసి.. పోలవరం విషయంలో తామే చంద్రబాబు హెచ్చరించామని, అందుకే ఆయన పట్టిసీమ కట్టారని చెప్పుకొచ్చారు. ముంపు మండలాల విషయంలోనే బీజేపీదే క్రెడిట్ అన్నారు. మొత్తంగా చంద్రబాబుది ఏమీ లేదు.. పోలవరం పూర్తయినా, పట్టిసీమ నుంచి నీళ్లు పారినా మా చలవే.. అని కమల నాథులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కట్ చేస్తే.. రెండు రోజుల కిందట కేంద్రం నుంచి జలవనరుల మంత్రి, మహారాష్ట్ర కు చెందిన సీనియర్ బీజేపీ దిగ్గజం, మాజీ జాతీయ అధ్యక్షుడు గడ్కారీ ఏపీకి వచ్చారు. నేరుగా సీఎం చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లారు.
అక్కడ.. జరుగుతున్న పనులను సమీక్షించారు. అంతే.. ఆయన నోటి వెంట.. చంద్రబాబుపై పొగడ్తల ప్రవాహం తన్నుకొచ్చింది. బాబు వల్లే ప్రాజెక్టు ఇంత వేగంగా పూర్తవుతోందన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపులో నిజాయితీ ఉండి ఉండవచ్చన్నారు. ప్రాజెక్టుకు పూర్తిగా సహకారం అందిస్తామని, వచ్చే ఏడాదికి చంద్రబాబు చెప్పిన సమయానికి పూర్తయ్యేలా చూస్తామని చెప్పి ఢిల్లీ వెళ్లారు. అంతే!! ఇక్కడి నేతల నోళ్లకు తాళం పడింది. దీంతో ఇప్పుడు మీడియా ముందుకు ఎలా రావాలో తెలియక బీజేపీ ఏపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇదీ.. ఏపీ బీజేపీ సంగతి!!