అదేంటో చంద్రబాబునాయుడు మాట్లాడితే ప్రతిదీ చారిత్రాత్మకమని, యావత్ దేశంలోనే చరిత్రని అంటుంటారు. తన పాలనలో అభివృద్ధిగురించి ఏదైనా చెప్పాలంటే చాలు ప్రపంచంలోనే చరిత్ర అని అంటారు. తక్కువలో తక్కువ దేశంలోనే చరిత్ర అంటూ అభివర్ణిస్తారు. ఇదంతా దేనికంటే, వచ్చే ఎన్నికల్లో టిడిపిని ఏకపక్షంగా గెలిపించటం చారిత్రక అవసరమట. తెలుగుదేశంపార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకుందట. విచిత్రంగా లేదూ చంద్రబాబు మాటలు వింటుంటే ?
సిఎం అవ్వటం చంద్రబాబుకు అవసరం
వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకోవటం ప్రజల అవసరం ఎలాగవుతుందో చంద్రబాబుకే తెలియాలి. టిడిపి గెలవటం ఏవిధంగా చారిత్రాత్మకమో చంద్రబాబే చెప్పాలి. నిజానికి చంద్రబాబు చెప్పుకుంటున్నంత సీన్ లేదు పాలనకు. 2014లో ముఖ్యమంత్రైన దగ్గర నుండి పరిపాలన తీరును అందరూ చూస్తున్నదే. అవినీతి విసృంఖలంగా పెరిగిపోయింది. శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదన్నట్లుంది. ఎక్కడ చూసిన చంద్రబాబు సామాజికవర్గానిదే పెత్తనంగా మారిపోయింది. అంతెందుకు చంద్రబాబు పాలనపై జనాల్లోనే కాదు పార్టీ శ్రేణుల్లో కూడా వ్యతిరేకత వచ్చేస్తోంది. వాస్తవం ఇలాగుంటే తానేదో అద్భుతంగా పరిపాలన చేస్తున్నట్లు భ్రమల్లో ఉన్నారు చంద్రబాబు.
అమెరికా సంక్షోభంతో పోలికా ?
1930లో అమెరికా సంక్షోభం నుండి గట్టెక్కించటానికి రూజ్ వెల్ట్ ను నాలుగు సార్లు అక్కడి జనాలు అధ్యక్షునిగా ఎన్నుకున్నారట. మామూలుగా అయితే అమెరికా అధ్యక్ష పదవికి ఎవరైనా రెండు సార్లకన్నా ఎన్నికయ్యేందుకు లేదు. అయితే, సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా రాజ్యాంగాన్ని సవరించి నాలుగుసార్లు ఎన్నుకున్నట్లు చంద్రబాబు చెబుతుండటం విచిత్రంగా ఉంది. అమెరికాలో నిబంధన మనకు లేదన్న విషయం చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం మనకు లేదు.
ఎన్నికలు లేకుండా శాస్వత సిఎంగా ఉండాలా ?
ఇక్కడే చంద్రబాబు మాటలపై అనుమానం వస్తోంది. రాజ్యాంగాన్ని సవరించటమంటే ఎన్నికలు జరపకుండా నాలుగు పర్యాయాలు తానే ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నట్లుంది. రాష్ట్రంలో కూడా అటువంటి సంక్షోభమే ఉందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి అటువంటి సంక్షోభం ఏమీ లేదు. ఒకవేళ సంక్షోభం ఉందంటే అది చంద్రబాబు పాలన వల్ల తలెత్తింది మాత్రమే. ముఖ్యమంత్రవ్వటం చంద్రబాబుకు చారిత్రత్మక అవసరం. అంతేకానీ చంద్రబాబునే గెలిపించాల్సిన అవసరం ప్రజలకు లేదు.
మొన్నటి వరకూ చక్రం ఎందుకు తిరగలేదో ?
చంద్రబాబు లెక్క ప్రకారం వచ్చే ఎన్నిక ఏకపక్షంగా సాగాలట. ఏకపక్షమంటే మొత్తం 25 ఎంపి సీట్లూ టిడిపికే కట్టబెట్టలట. మొత్తం 25 సీట్లు టిడిపికే కట్టబెడితే కేంద్రంలో చక్రం తిప్పుతారట. ఎలా సాధ్యమో చంద్రబాబుకే తెలియాలి. మొత్తం 25 ఎంపిల్లో మొన్నటి వరకూ అంటే బిజెపితో కలుపుకుని 20 మంది ఎంపిలు టిడిపిలోనే ఉన్నారు. అంతమంది ఎంపిలున్నా కేంద్రంలో చంద్రబాబు చక్రం ఎందుకు తిరగలేదో చెప్పాలి. నాలుగేళ్ళు ఏపి హక్కులను కేంద్రం ముందు తాకట్టుపెట్టిన చంద్రబాబు 2019 తర్వాత హక్కుల కోసం పోరాడుతానని చెబితే ఎవరైనా నమ్ముతారా ? ఏంటో చంద్రబాబు మాటలు ఎవరికీ ఒక పట్టాన అర్ధమవటం లేదు. అసలు తానేం మాట్లాడుతున్నారో కనీసం చంద్రబాబుకైనా అర్ధమవుతోందో లేదో ?