కేంద్రప్రభుత్వం చర్యలు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసేదిగా ఉంది. వైసిపి ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుకను పార్లమెంటు సమావేశాల్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా లోక్ సభ సచివాలయం గుర్తించటం విచిత్రంగా ఉంది. కర్నూలు లోక్ సభకు వైసిపి తరపున గెలిచిన బుట్టా రేణుక తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. ఆ సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. అందరికీ తెలిసిన ఫిరాయింపుల విషయం లోక్ సభ ఉన్నతాధికారులకు తెలియకపోవటం విచిత్రంగా ఉంది.
అనర్హతకు బదులు వైసిపి గుర్తింపా ?
పార్టీ ఫిరాయించిన బుట్టాను వెంటనే అనర్హురాలిగా ప్రకటించాలంటూ మొన్నటి వరకూ లోక్ సభలో ఫ్లోర్ లీడర్ గా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అనేక సార్లు ఫిర్యాదు చేశారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో వైసిపికి చెందిన ఐదుమంది ఎంపిలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన ఎంపిలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని కూడా ఎంపిలు డిమాండ్ చేశారు. వారి అనర్హత పిటీషన్ ప్రస్తుతం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వద్ద పెండింగ్ లో ఉంది. అయితే, వైసిపిలో ఉన్నపుడు బుట్టా డిప్యుటి ఫ్లోర్ లీడరే లేండి.
ఇంత గుడ్డిగా లోక్ సభ పనిచేస్తోందా ?
ఇదిలావుంటే, బుధవారం నుండి వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఆ నేపధ్యంలో స్పీకర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి వైసిపి డిప్యుటి ఫ్లోర్ లీడర్ హోదాలో లోక్ సభ సెక్రటేరియట్ బుట్టా రేణుకకు ఆహ్వానం పంపటం విచిత్రంగా ఉంది. ఫిరాయింపులపై ఇంత రచ్చ జరుగుతున్నా లోక్ సభ సెక్రటేరియట్ బుట్టాకు ఆహ్వానం పంపిందింటే రెండే కారణాలై ఉంటాయని అనుమానిస్తున్నారు. ఒకటి లోక్ సభ సచివాలయం సిబ్బంది గుడ్డిగా పనిచేస్తుండాలి.
విషయం వెనుక ఏదైనా కుట్రుందా ?
లేకపోతే ఎటూ వైసిపికి లోక్ సభలో ఎంపిలు లేరు కాబట్టి ఫిరాయింపు ఎంపిలనే వైసిపి ఎంపిలుగా పరిగణించాలంటూ టిడిపి ఏమైనా కుట్ర చేస్తోందా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ విషయమై లోక్ సభ స్పీకర్ ముందు అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏదేమైనా లోక్ సభ సచివాలయం చేసిన నిర్వాకం వల్ల కేంద్రం పరువే రోడ్డున పడింది.