తిరుపతి దేవస్థానం లో టీటీడీ అండ్ చంద్ర బాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తిరుమల స్వామీ భక్తులను విష్మయానికి గురి చేసింది. మహా సంప్రోక్షణలో భాగంగా ఆలయాన్ని 6రోజుల పాటు మూసివేస్తామని టీటీడీ ప్రకటించింది. దీనితో అన్నివైపులా నుంచి వ్యతిరేకత వచ్చింది. టీటీడీ ఏకపక్ష నిర్ణయం అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. సోషల్ మీడియా లో టీటీడీ ని దుమ్మెత్తి పోశారు. దీనితో చంద్ర బాబు నాయుడు వ్యతిరేకత ను గుర్తించాడు.
12 సంవత్సరాలకోసారి జరిగే మహా సంప్రోక్షణకు గతంలో ఎప్పుడూ ఆలయాన్ని మూసివేసిన చరిత్రలేదు. ఈసారి ఎందుకీ అత్యుత్సాహం? అసలు భక్తులను కొండపైకి రావద్దనడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో కూడా దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో మరోసారి శ్రీవారి విలువైన ఆభరణాలు, సంపదకు ఏమైనా ముప్పు పొంచిఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
దీంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే అసలుకే ఎసరు వస్తుందనుకున్న బాబు, దర్శనాల విషయంలో వెనకడుగు వేశారు. మహా సంప్రోక్షణ కార్యక్రమంపై టీటీడీ అధికారులతో చర్చించిన బాబు, గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలనే అనుసరించాలని ఆదేశించారు. రోజుల తరబడి భక్తులు దర్శనానికి ఎదురుచూసేలా చేయొద్దని, మహా సంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని సూచించారు.