ప్రధాన ప్రతిపక్షం వైసిపికి వ్యతిరేకంగా టిడిపి, బిజెపిలు కుమ్మకయ్యాయా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. బుధవారం నుండి మొదలయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై చర్చించేందుకు ప్రధాని సమావేశం నిర్వహించారు.
బుట్టా పేరుతో ఆహ్వానం
అయితే, వైసిపి తరపున ఆ సమావేశానికి హాజరైన విజయసాయిరెడ్డి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎందుకంటే, లోక్ సభలో వైసిపి ఫ్లోర్ లీడర్ గా ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుక పేరుతో ప్రధాని కార్యాలయం ఆహ్వానం పంపింది. పార్టీల వారీగా కేటాయించిన సీట్ల ముందు బుట్టా పేరుతో వైసిపి నేమ్ ప్లేట్ చూడ్డంతో విజయసాయికి మండిపోయింది. సమావేశానికి ముందే రాజ్యసభ సభ్యుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుట్టా పేరుతో నేమ్ ప్లేట్ ఉండటం, ఆహ్వానం పంపటాన్ని విజయసాయి అభ్యంతరం వ్యక్తం చేశారు.
సమర్ధించుకున్న కేంద్రమంత్రి
విచిత్రమేమిటంటే, విజయసాయి అభ్యంతరాన్ని కేంద్ర పార్లమెంటరీ పార్టీ మంత్రి అనంతకుమార్ పట్టించుకోకపోవటం. లోక్ సభలో వైసిపి ఎంపిలు రాజీనామాలు చేశారుకాబట్టి, బుట్టాతో పాటు మరో ముగ్గురు రాజీనామాలు చేయలేదు కాబట్టి ఆమెనే సమావేశానికి ఆహ్వానించినట్లు విచిత్రమైన సమాధానం చెప్పారు. అంటే బుట్టా, ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత లపై అనర్హత వేటు వేయాలని వైసిపి ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న విషయం కేంద్రమంత్రికి తెలీకుండానే ఉంటుందా ?
కుమ్మక్కు రాజకీయానికి ఇదే నిదర్శనం
ఇక్కడే విజయసాయి తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. వైసిపికి వ్యతిరేకంగా టిడిపి, బిజెపిలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. టిడిపి, బిజెపిలు కుమ్మక్కు అయ్యాయనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలంటూ ధ్వజమెత్తారు. విజయసాయి కుమ్మక్కు వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.