తాను అధికారంలోకి వస్తే చంద్రబాబునాయుడు మీద ప్రతీకార చర్యలుండవని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే చేసిన తప్పులకు సంబంధించి విచారణ అయితే ఉంటుందని కూడా జగన్ చెప్పారు. తప్పులు జరిగినపుడు విచారణ జరగాలి కదా ? జరిగిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేయాలి కదా ? అంటూ జగన్ క్లారిటీ ఇచ్చారు. పాదయాత్రలో ఉన్న జగన్ ఓ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి చంద్రబాబుకు జగన్ అభయం ఇచ్చినట్లే అని వైసిపి నేతలంటున్నారు.
టిడిపికి 40 సీట్లకన్నా రావు
జగన్ తన ఇంటర్వ్యూలో కొన్ని హామీలతో పాటు మరికొన్ని విషయాలపై నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను చెప్పారు. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ఏపిలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అంటూ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి 40 సీట్లకన్నా రావని కూడా జోస్యం చెప్పారు.
ఎవరితోనూ పొత్తుండదు
పొత్తులపై మాట్లాడుతూ, ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. అడ్డుగోలుగా రాష్ట్రాన్ని విభజించిన పార్టీ ఒకటి, ప్రత్యేకహోదా ఇచ్చే స్ధితిలో ఉండి కూడా ఇవ్వని పార్టీ మరొకటి అయినపుడు వాళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో పవన్ వల్ల కొందరు చంద్రబాబుకు ఓటు వేశారని జగన్ అంగీకరించారు. ఇపుడు చంద్రబాబుతో పవన్ లేడు కాబట్టి అప్పట్లో చంద్రబాబుకు పడిన ఓట్లు ఇపుడు పడవన్నారు. కాబట్టి అప్పుడు చంద్రబాబుకు పడిన ఓట్లలో రేపటి ఎన్నికల్లో కొన్ని పవన్ కు పడతాయని మిగిలిన ఓట్లు వైసిపికి పడతాయని అంచనా వేశారు. గతంలో ఉన్న తమ ఓటు షేర్ ఎలాగూ ఉంటుంది కాబట్టి తమ గెలుపుకు ఢోకా లేదన్నారు.
తప్పులపై సమీక్షలు
పోయిన ఎన్నికల్లో తమవైపు నుండి జరిగిన తప్పులపై సమీక్షలు చేసుకుంటున్నట్లు చెప్పారు. తమవైపు కొన్ని తప్పులు జరిగే ఉంటాయని అంగీకరించారు. మనిషన్నవాడు తప్పు చేయకుండా ఉండడు కాబట్టి తాను కూడా తప్పులు చేసే ఉంటానని అంగీకరించారు. జరిగిన తప్పులను రిపేర్ చేసుకుని ముందుకు అడుగులు వేస్తామన్నారు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా అధినేత విశ్వసనీయత పైనే ఆధారపడి ఉంటుందన్నారు. తన ఎనిమిదేళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కువభాగం రోడ్డుపైనే ఉన్నట్లు చమత్కరించారు. జనాలు కూడా సహజంగానే వైసిపి అంటే జగన్ పార్టీ అనే భావించే అవకాశం ఉందన్నారు.
హోదా అంటే సై
ప్రత్యేకహోదా ఇస్తానంటే ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వటానికి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఏపి విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడికి సున్నా మార్కులే వేస్తానన్నారు. హోదా ఇస్తానని చెప్పీ మాట తప్పినందుకు సున్నా మార్కులకన్నా వేయలేనని స్పష్టం చేశారు. మోడి విషయంలో తాను ఎప్పుడు కూడా మెతకగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. కేంద్రాన్ని ఎక్కడికక్కడ కడిగిపారేస్తున్నట్లు చెప్పుకున్నారు.
అవినీతి వరద అందరికీ తెలిసిందే
రాష్ట్రంలో తన పాలన ఎలాగుందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరికీ ఏమీ తెలీదని చంద్రబాబు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి ఏ స్ధాయిలో పారుతోందో అందరికీ తెలుసన్నారు. జరుగుతున్న అవినీతి బయటపడకుండా మీడియాతో మ్యానేజ్ చెయొచ్చు కానీ జనాల్లో చర్చలు జరపకుండా ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికలు జరిగితే తెలుగుదేశంపార్టీ పరిస్ధితేంటో చంద్రబాబుకు తెలిసివస్తుందని జగన్ స్పష్టం చేశారు.