చంద్రబాబునాయుడుకు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ట్యూషన్ చెప్పటమేంటి ? అని అనుమానం వస్తోందా ? అవును నమ్మినా నమ్మకపోయినా జరిగిందదే. ఈరోజు నుండి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో టిడిపి ఎంపిలు ఏ విధంగా వ్యవహారంచాలో, కేంద్రప్రభుత్వాన్ని ఎలా ఇరుకునపెట్టాలనే విషయమై ఉండవల్లి నుండి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారని సమాచారం. దాదాపు గంటపాటు అమరావతిలోని సచివాలయంలో జరిగిన వీరిద్దరి భేటీలో పార్లమెంటులో టిడిపి ఎంపిలు వ్యవహరించాల్సిన విధానాలపై ఉండవల్లి సూచనలు చేసినట్లు తెలిసింది.
అవిశ్వాసాన్ని ఆమోదిస్తారా ?
ప్రత్యేకహోడా ఇవ్వనందుకు నిరసనగా తాను ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోడి సర్కార్ పై తెలుగుదేశంపార్టీ ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందచేసింది. సరే, తీర్మానాన్ని స్పీకర్ ఆమోదిస్తారా ? చర్చకు అనుమతిస్తారా అన్నది వేరే విషయం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు అవిశ్వాస తీర్మానం అందచేసింది టిడిపి ఎంపి.
ఉండవల్లి నుండి సలహాలు తీసుకున్న చంద్రబాబు
ఒకవేళ పొరబాటున స్పీకర్ గనుక అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించి చర్చకు అనుమతిస్తే సభలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై చంద్రబాబు మాజీ ఎంపి ఉండవల్లి నుండి సలహాలు తీసుకున్నారట. ఉండవల్లి కూడా పార్లమెంటరీ ప్రాక్టీస్ పై అనేక సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. మరి, ఉండవల్లి ఇచ్చిన సలహాలు, సూచనలు చంద్రబాబు ఏ మేరకు ఆచరిస్తారో వేచి చూడాల్సిందే .