రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలని చూస్తోంది. కుదిరితే.. టైం బాగుంటే.. అధికారంలోకి రావాలని కలలుకంటోంది. దీనికి గాను పార్టీ నుంచి పరారైన పాతకాపులకు పెద్ద ఎత్తున ప్రాదాన్యం ఇస్తోంది. అయితే, ఈ క్రమంలో పాతకాపులు తిరిగి వచ్చే మాట అటుంచి.. ఉన్న నాయకుల్లో.. పార్టీలో పదవులు, గౌరవ సత్కారాలు పొందిన నేతల్లోనే ఒకరిద్దరుపార్టీకి ఇప్పటికీ వ్యతిరేకంగానే ప్రచారం చేస్తున్నారు. మరి వారిని అదుపులో పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్కు ఉందా? వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకుని కాంగ్రెస్ ఫ్యూచర్ను సరిచేసే అవకాశం ఉందా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్ నేత, హైకోర్టు లాయర్.. మరోసారి కాంగ్రెస్పై వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు.
‘‘రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లును ఆమోదించారు. దీనిపై నేను మొదటి నుంచీ పోరాటం చేస్తున్నాను’’- అంటూ ఆయన ఏపీ విభజనపై తాజాగా మరోసారి గళం విప్పారు. ఏపీ విభజన జరిగింది.. కాంగ్రెస్ హయాంలో ఈ నేపథ్యంలోనే 2014లో ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. అప్పటి నుంచి సుప్త చేతనావస్థలో ఉన్న పార్టీకి జవసత్వాలు అందిం చేందుకు పార్టీ నేతలు పెద్ద ఎత్తున వ్యూహ రచన సిద్ధం చేసుకున్నారు. పాతవారికి తిరిగి పల్లకీలు కట్టేందుకు రెడీ అయ్యారు., అంతేకాదు, తమకు ఏపీలో ద్రోహి ఎవరైనా ఉన్నారంటే.. అది జగనేనని అంటున్నారు. జగన్ పార్టీ వల్లే తాము అడ్రస్ గల్లంతయ్యామని, తమ ఉనికిని ప్రశ్నార్థకం చేశారని కాంగ్రెస్ నేతలు కళ్లు పొడుచుకుని మరీ కుళ్లి ఏడుస్తున్నారు. ఈ విషయంలో వారు పెద్ద ప్లానే సిద్ధం చేసుకున్నారు.
జగన్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోవడమే కాకుండా అటు కేంద్రంలోనూ కుదిరితే రాష్ట్రంలోనూ పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నారు. అయితే, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి వంటి కీలక ఎంపీలుగా చక్రం తిప్పిన నాయకులు రాష్ట్ర విభజనపై ఇప్పటికీ నిప్పులు కక్కుతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని, పార్లమెంటు తలుపులు ఎందుకు మూశారని ఉండవల్లి ప్రశ్నించారు.
ఇక, సబ్బం హరి వాయిస్ దాదాపు ఇంతే. నిజానికి వీరిద్దరూ ఏ పార్టీలోనూ లేరు. పైగా జగన్ అంటే ఇద్దరికీ మంటే. అయినా కూడా కాంగ్రెస్కు డ్యామేజీ చేసే వ్యాఖ్యలే వీరు మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి యాంటీ వాయిస్.. అందునా మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులే కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోస్తుంటే.. జగన్పై పడి ఏడవడం ఎందుకో కాంగ్రెస్ నాయకులే చెప్పాలి!