మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రభుత్వంపై లోక్ సభలో టిడిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ పరిగణలోకి తీసుకున్నారు. తీర్మానంపై ఎప్పుడు చర్చకు అనుమతించేది, ఎంత సమయం కేటాయించేది పది రోజుల్లో తెలియచేస్తానంటూ స్పీకర్ స్పష్టం చేశారు. ఈరోజు నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేకహోదా లాంటి అంశాలు అమల్లోకి రాకపోవటంపై నిరసనగా టిడిపి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. టిడిపి ఎంపి కేశినేని నాని ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని తాను పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పీకర్ చెప్పారు. అదే సమయంలో తీర్మానానికి ఎంత మంది ఎంపిలు మద్దతిచ్చేది స్పీకర్ లెక్క కూడా చూసుకున్నారు.
మొదటి మెట్టెక్కిన టిడిపి
మొత్తం మీద ప్రశాంతంగానే అవిశ్వాస తీర్మానంపై ప్రక్రియ కదిలింది. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో కూడా వైసిపి. టిడిపి ఎంపిలు ఎవరికి వారుగా ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ టేకప్ చేసినా అప్పటి గందరగోళంలో చర్చకు అనుమతించలేదు. ఇపుడు సభ ప్రశాంతంగా ఉన్న కారణంగా ఎంపిల మద్దతు సంఖ్యను లెక్క వేయటమే కాకుండా ఎప్పుడు చర్చకు అనుమతించేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారంటే ఆ మేరకు టిడిపి విజయం సాధించిందనే అనుకోవాలి.
చర్చకు అనుమతించేది నిజమేనా ?
అయితే, కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అనుమతించేంత వరకూ అనుమానమే అంటున్నారు నేతలు. ఎందుకంటే, మొన్నటి సమావేశాల్లో కూడా ఇదే విధంగా ఎంపిల మద్దతు లెక్క తేల్చాలనే విషయంలో రోజుల తరబడి స్పీకర్ విషయాన్ని నాన్చిన సంగతి అందరూ చూసిందే. చివరకు సభను నిరవధిక వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. ఈ సమావేశాలు జరిగేదే సుమారు 20 రోజులు. చర్చకు తేది, సమయాన్ని పది రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. పది రోజుల తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.