ఎస్వీయూ పరిధిలోని అనుబంధ ఎంబీఏ కళాశాలలకు నిర్వహిస్తున్న ఎంబీఏ 2వ సెమిస్టర్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. పరీక్షల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆపరేషన్ రీసెర్చ్ సబ్జెక్ట్ కు పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్ష కు సంబంధించిన ప్రశ్నపత్రం సోమవారం రాత్రే చాలా మంది విద్యార్థులకు మొబైల్ ఫోన్ లో వాట్సాప్ లో వచ్చినట్లు వదంతులు వినిపించాయి.
ఈ అంశంపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రశ్నపత్రం ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల మొబైల్స్ కు ఒక రోజు ముందు వాట్సాప్ కు వచ్చిందని అదే ప్రశ్నపత్రం మంగళవారం నిర్వహించిన పరీక్షలో ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ప్రశ్నపత్రం లీకేజ్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై ఉపకులపతి ఆచార్య ఆవుల దామోదరం తీవ్రంగా స్పందించారు.
కఠిన చర్యలు తప్పవు :
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎం.బి.ఎ రెగ్యూలర్ రెండవ సెమిస్టర్ (17-7-2018) ‘ఆపరేషన్స్ రీసెర్చి’ పరీక్షా పత్రం లీక్ అయినట్లు మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి నిజనిర్ధారణ చేసేందుకు ఒక ప్రత్యేక కమిటి వేస్తామని, ఆ కమిటీ వారు కులంకషంగా పరిశీలించి బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారు ఎలాంటి వారైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఉపకులపతి ఆచార్య ఆవుల దామోదరం హెచ్చరించారు.
దోషులుగా తేలిన వారి కళాశాల అఫిలియేషన్ ను రద్దు చేస్తామన్నారు. నిన్న జరిగిన ‘ఆపరేషన్ రీసెర్చ్’ ( ప్రశ్నా పత్రం నెం.4-75-207) రెగ్యూలర్ పరీక్ష రద్దు చేసిన కారణంగా ఈ పరీక్ష 21-07-2018 వ తేదీ శనివారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహిస్తామని కంట్రోలర్ వి.సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.