చంద్రబాబునాయుడుకు అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలకు తాను హాజరయ్యేది లేదంటూ పెద్ద బాంబు పేల్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రభుత్వంపై తెలుగుదేశంపార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు వస్తోంది. కాబట్టి ఎంపిలందరూ పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరవ్వాలంటూ టిడిపి విప్ కూడా జారీచేసింది. ఇక్కడే జెసి అడ్డం తిరిగారు.
విప్ ను లెక్క చేసేది లేదు
అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ జారీ చేసిన విప్ ను తాను ఖాతరు చేసేదిలేదన్నట్లు మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలకు తాను హాజరుకానంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు ఇంగ్లీష్ కానీ హిందీ కాని రాదన్నారు. తెలుగు తప్ప మరే భాష రాని తాను పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని ఏం చేయాలంటూ ఎదురు ప్రశ్నించారు. పైగా తమ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల మోడి ప్రభుత్వం ఏమన్నా పడిపోతుందా ? అంటూ సూటిగా ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని పడగొట్టం
అదే సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, టిడిపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌధరి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వాన్ని పడగొట్టటం తమ ఉద్దేశ్యం కాదని తేలిపోయింది కదా ? జెసి గుర్తుచేస్తున్నారు. అందుకే తాను పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు జెసి చేసిన ప్రకటన టిడిపి పార్టీలో సంచలనంగా మారింది. మరి జెసి వ్యవహారాన్ని చంద్రబాబు ఏ విధంగా డీల్ చేస్తారో చూడాల్సిందే ?