వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నారా ? పార్టీ వర్గాల నుండి అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ ఏ విషయంలో అంటే ప్రజా ప్రతినిధుల చేత రాజీనామాలు చేయించటంలో. పోయిన ఎన్నికల్లో జనాలు వైసిపి అభ్యర్ధులకు ఓట్లు వేసింది తమ సమస్యలను చట్ట సభల్లో ప్రస్తావిస్తారని. ప్రస్తావిస్తారా లేదా ? అధికారపార్టీ ఏం చేస్తుంది ? అన్నది వేరే సంగతి.
అసెంబ్లీ విషయంలో మొదటి తప్పు
జగన్ మొదటి అసెంబ్లీ విషయంలో తప్పు చేశారు. సభలో తమను మాట్లాడనీయటం లేదని, తమ ఎంఎల్ఏలను చంద్రబాబునాయుడు పశువులను కొన్నట్లు కొనుగోలు చేశారని, వారిపై అనర్హత వేటు వేయమని డిమాండ్ చేసినా పట్టించుకోవటం లేదనే ఆరోపణలతో వైసిపి అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తోంది. ఇక్కడే జగన్ పెద్ద తప్పు చేశారు. అసెంబ్లీ లో సమస్యలు ప్రస్తావించకుండా వైసిపి గొంతును టిడిపి నొక్కేస్తే ఆ విషయంపై జనాలే తగిన నిర్ణయం తీసుకుంటారు. అదే సమయంలో ఫిరాయింపులపై చర్యలు తీసుకోవటం లేదన్నది రెండో అభియోగం. ఈ విషయంలో కూడా జనాలదే అంతిమ తీర్పు.
ఫిరాయింపులపై మండిపోతున్న జనాలు
ఇప్పటికే ఫిరాయింపులపై ఆయా నియోజకవర్గాల్లో జనాలు మండిపోతున్నారు. ఇపుడు వారిపై స్పీకర్ చర్యలు తీసుకున్నా, తీసుకోకపోయినా ఒకటే. మహా అయితే ఉప ఎన్నికలు వచ్చేవేమో అంతే. పై రెండు కారణాలు చూపి వైసిపి ఎంఎల్ఏలు అసలు అసెంబ్లీకి రారటూ జగన్ ప్రకటించారు. .జగన్ నిర్ణయం ఒక విధంగా ప్రజా తీర్పును అపహాస్యం చేసేదిగానే ఉంది. దాదాపు 45 నియోజకవర్గాల్లోని సమస్యలు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేనట్లే.
ఎంపిల రాజీనామాలు రెండో తప్పు
ఇక, తాజాగా పార్లమెంటు సభ్యుల విషయంలో కూడా జగన్ మళ్ళీ అంతకన్నా పెద్ద తప్పే చేశారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో తమ ఎంపిలతో రాజీనామాలు చేయించారు. సభలో ఉండి సమస్యలపైన, డిమాండ్లపైన పోరాడాల్సిన ఎంపిలు ఇపుడు సభ బయటుండి ప్ల కార్డులు చేతిలో పెట్టుకుని పోరాడాల్సొచ్చింది. వ్రతం చెడ్డా ఫలితమైనా దక్కిందా అంటే అదీ లేదు. సభలో మాజీలుగా మిగిలిపోయారు, రాజీనామాలూ వృధా అయిపోయాయి. ఇటు పార్లమెంటులో అయినా అటు అసెంబ్లీలో అయినా నష్టపోయింది మొత్తానికి వైసిపినే. త్వరలో ఎంఎల్ఏలు కూడా రాజీనామాలు చేస్తారని అంటున్నారు. ఏమవుతుందో చూడాలి. సరే, ఏమి చేసినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించటమే లక్ష్యంగా జగన్ వ్యూహాలుంటున్నాయి. అయితే, జగన్ వ్యూహాలు ఎంత వరకూ వర్కవుటవుతాయో వేచి చూడాల్సిందే.