ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో జగన్ పై మాటల దాడి లో ఎక్కువగా ముందుండే నేత రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఈ క్రమంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు కు చెక్ పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎప్పటినుండో కింజరాపు కుటుంబంతో రాజకీయ వైరం చేస్తున్న కిల్లి ఫ్యామిలీ ని వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారట జగన్.
మరి కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపా రాణిని వైసీపీ లో చేర్చుకుని అచ్చెన్నాయుడి పై పోటీ పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో అచ్చెన్న అన్న ఎర్ర నాయుడి మీద పోటీ చేసి సంచలన విజయం సాధించారు కృపా రాణి.
గత ఎన్నికల్లో అదే ప్రాంతంలో పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఎంపీ రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ సందర్భంలో ప్రజలలో ఎర్రన్నాయుడు మరణంతో సానుభూతి ఉన్న నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు విజయం నల్లేరు మీద నడకలా సాగింది.
అయితే గతంలో ఎర్రన్నాయుడుకి షాకిచ్చిన కిల్లి కృపారాణిని రంగంలోకి దింపి ఈసారి అచ్చెన్నాయుడుని రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కొద్దిపాటి శాతంతో జగన్ కి అధికారం దూరమవడంతో ఈసారి పక్కాగా నియోజకవర్గాలలో కచ్చితంగా గెలుపొందే క్యాండిడేట్లనే ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని మరీ దింపుతున్నాడట.