చంద్రబాబునాయుడును అనంతపురం ఎంపి జెసి దివకార్ రెడ్డి టెన్షన్ పెడుతూనే ఉన్నారు. షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. సాయంత్రం వరకూ అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేది లేదని చెబుతున్న జెసి తాజాగా ఎంపి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. శుక్రవారం లోక్ సభలో జరిగే అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటానని అయితే, చర్చ తర్వాత ఎంపిగా రాజీనామా చేస్తానని జెసి చేసిన ప్రకటన పార్టీలో సంచలనంగా మారింది.
మండిపోతున్న ఎంపి
ఈరోజు ఉదయం నుండి ఎంతమంది నేతలను పంపి బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా జెసి నుండి సానుకూల సమాధానం రాలేదు. ఒకవైపు జిల్లా నేతలతో పడక పోవటం మరోవైపు చంద్రబాబు కూడా తననులైట్ గా తీసుకోవటాన్ని జెసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో అవిశ్వాస తీర్మానానికి హాజరుకాకూడదని జెసి తీసుకున్న నిర్ణయం పార్టీలో సంచలనంగా మారింది.
చంద్రబాబుకు షాకు మీద షాకు
మొత్తానికి ఈరోజు ఉదయం నుండి తనపై వస్తున్న ఒత్తిడికి తలొంచిన జెసి చివరకు రేపటి అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనేందుకు అయిష్టంతోనే అంగీకరించారు. అయితే, సభకు హాజరైన తర్వాత చివరలో తాను రాజీనామా చేస్తానంటూ చేసిన ప్రకటనతో చంద్రబాబుతో పాటు నేతలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలో కూడా తన వ్యక్తిగత లక్ష్యాన్ని చేరుకోవటానికి, ప్రత్యర్దులపై పై చేయి సాధించటానికి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. తర్వాత చంద్రబాబు జోక్యంతో జెసి అప్పట్లో తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.మరి ఇపుడేం చేస్తారో చూడాల్సిందే.