లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు తను హాజరు కాను అని ప్రకటించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారు. అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగడంతో ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీ రేపు సభకు హాజరు అవుతాను అని ప్రకటించారు. అనంతపురంలో నెలకొన్న పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు జోక్యంతో సమసిపోయినట్టు కనబడుతోంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాబోనంటూ అలకబూనిన అనంతపురం ఎంపీ జేసి దివాకరరెడ్డిని బుజ్జగింపులో భాగంగా ఆయన అలకకు కారణాలను తెలుసుకునేందుకు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని మాట్లాడారు.
సీఎం కలుగజేసుకోవడంతో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి మధ్య నెలకొన్న పంచాయతీ సద్దుమణిగింది. అనంతపురం జిల్లా అభివృద్ధికి ఇరువు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎంతో భేటీ అనంతరం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ- "జేసీతో మనస్పర్థలు ఉంటే సర్దుకుపోవాలని చంద్రబాబు నాతో చెప్పారు. జేసీతో నాకు వ్యక్తిగతమైన సమస్యలేమీ లేవు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. అనంతపురం అభివృద్ధి కోసం అందరికీ సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. పార్టీ బలోపేతానికి జేసీతో కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. జేసీకి నాతో ఏ సమస్య ఉందో ఆయనకే తెలియాలి" అని వివరించారు.
మరోవైపు, అనంతపురంలో రహదారుల విస్తరణకు ₹45.53 కోట్ల సవరించిన అంచనాలతో పనులకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలక వీడినట్టు సమాచారం. ఈ రాత్రికి ఆయన దిల్లీకి బయల్దేరే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటానని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.
తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీ వెళుతున్నట్టు తెలిపారు. తనతో సీఎం చంద్రబాబు మాట్లాడారని, ఢిల్లీకి వెళ్లమని చెప్పారని అన్నారు. 15 ఏళ్ల తర్వాత అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుందని, వెళ్లకపోతే పార్టీకి మచ్చ వస్తుందని ఆలోచించుకోమని చెప్పారన్నారు. తన వల్ల పార్టీకి మచ్చ రావడం ఇష్టం లేదన్నారు. ఢిల్లీ వెళ్తానని కేంద్ర ప్రభుత్వానికి గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఓటేస్తానని అన్నారు.