పార్టీలేంటి ఆ లెక్కలేంటి ? అని అనుకుంటున్నారా ? ఈరోజు అవిశ్వాసం సందర్భంగా పార్లమెంటులో పై పార్టీలకు మాట్లాడేందుకు స్పీకర్ కేటాయించిన సమయం. నరేంద్రమోడి ప్రభుత్వంపై టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అడ్మిట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తీర్మానంపై ఈరోజే లోక్ సభలో దాదాపు ఏడు గంటలు చర్చ జరుగుతుంది. చర్చ వల్ల ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? అలాగే, చివరలో ఓటింగ్ జరుగుతుందా అన్నది వేరే సంగతి.
సగం గంటలు బిజెపికేనా ?
నోటీసును స్పీకర్ అడ్మిట్ చేశారు కాబట్టి సభలో చర్చ అంటూ చేయాల్సిందే. ఒకసారి చర్చ మొదలైన తర్వాత సభలోని ఎంపిల బలాబలాలను బట్టి ఆయా పార్టీలకు స్పీకర్ సమయం కేటాయించారు. విచిత్రమేమిటంటే నాలుగేళ్ళు రాష్ట్రాన్ని పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపణలకు గురైన కేంద్రంలోని (బిజెపి) ప్రభుత్వానికి సమాధానం చెప్పటానికి 3 గంటల 33 నిముషాలు సమయం వచ్చింది. నాలుగేళ్ళు రాష్ట్రంలో అసలు అభివృద్ధే జరగలేదని ఆరోపిస్తున్న టిడిపికి దక్కిన సమయం కేవలం 13 నిముషాలు మాత్రమే.
13 నిముషాలు సరిపోతుందా ?
నెంబర్ గేమ్ లో టిడిపికి దక్కిన సమయం చూస్తే అసలు ఆ సమయం ఎందుకు ఉపయోగపడుతందన్నదే అందరిలోనూ మొదలైన అనుమానం. ఎలాగంటే, విభజన చట్టంలో ఏపికి అప్పటి యూపిఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల జాబితా చదవాలంటే కూడా 13 నిముషాల సమయం సరిపోదు. ఇంక, నాలుగేళ్ళలో జరిగిన అన్యాయం గురించి వివరించాలంటే సమయం ఎక్కడుంటుంది ? మహా అయితే ఇంకో పది నిముషాల పాటు స్పీకర్ పొడిగిస్తే అదే ఎక్కువ.
మిగితా పార్టీలకే సమయం ఎక్కువ
ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటుంది. ఏపితో ఏ విధమైన సంబంధమూ లేని చాలా రాష్ట్రాల్లోని పార్టీలకు కూడా స్పీకర్ సమయం కేటాయించారు. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలోని శివసేన, తమిళనాడులోని ఏఐఏడిఎంకె, ఒడిషాలోని బిజెడి లాంటి అనేక పార్టీలకు స్పీకర్ సమయం ఇచ్చారు. ఇక్కడ విషయం ఏపికి సంబంధించినది. కానీ సమయం మాత్రం ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు కూడా కేటాయించారు. దాని వల్ల ఎవరికి ఉపయోగం ? ఆయా రాష్ట్రాల్లోని పార్టీలకు ఉపయోగం లేకపోగా నష్టపోయేది మాత్రం ఏపినే. అదే ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు కేటాయించిన సమయాన్ని కూడా ఆ పార్టీలతో చర్చించి టిడిపికే కేటాయిస్తే బాగుండేదనటంలో సందేహం లేదు.