కాంగ్రెస్ పార్టీతో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని కోట్ల కుటుంబం తెంచుకోనున్నదా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. పార్టీ అధిష్టానం తనను అవమానిస్తున్నదనే మనస్ధాపంతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ఈ విషయాన్ని కోట్ల మద్దతుదారులు మీడియా సమావేశంలోనే స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో పార్టీ అధిష్టానంపై కోట్ల మండిపడుతున్నారట. దాంతో త్వరలో కోట్ల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు కర్నూలు జిల్లాలో బాగా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ తో దశాబ్దాల అనుబంధం
దశాబ్దాల పాటు కాంగ్రెస్ లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన కోట్ట విజయభాస్కర్ రెడ్డి గురించి కొత్తగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయభాస్కర్ రెడ్డి తదనంతరం కొడుకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీలో బాగా యాక్టివ్ గా ఉన్నారు. 2014 లో జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఇతర నేతల్లాగానే కోట్ల కుటుంబం కూడా ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటి నుండి రాజకీయాల్లో జోరు తగ్గించారు.
టిడిపిలో చేరేది లేదన్న కోట్ల
మళ్ళీ త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కదా ? అందుకే చంద్రబాబునాయుడు ఆదేశాలతో టిడిపి నేతలు కోట్ల తలుపు తట్టారు. టిడిపిలోకి రమ్మంటూ ఆహ్వానాలు పంపారు. అయినా కోట్ల సానుకూలంగా స్పందించలేదు. పైగా తాను ఎప్పటికీ టిడిపిలో చేరేది లేదంటూ స్వయంగా ప్రకటించి సంచలనం రేపారు. అదే సమయంలో వైసిపి నుండి కూడా ఆహ్వానం అందింది. వైసిపిలో చేరుతానని చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి విషయంలో కోట్లలో సానుకూలత కనబడింది. దాంతో వైసిపిలో కోట్ల కుటుంబం చేరుతోందంటూ బాగా ప్రచారం జరుగుతోంది. అయినా కోట్ల మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
అధిష్టానంపై మండుతున్న కోట్ల
ఈ నేపధ్యంలోనే ఇతర పార్టీల్లోకి వెళ్ళిన నేతలందరినీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ పార్టీ అధ్యక్షుడు రాహూల్ గాంధి పిలుపిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సరే, నేతలెవరూ స్పందిచకపోయినా కోట్ల కుటుంబం కాంగ్రెస్ ను వీడదేమో అని అనుకున్నారు. అయితే, ఈమధ్యే రాహూల్ నియమించిన (సిడబ్య్యూసి) కాంగ్రెస్ వర్కింగ్ కమిటి లో ఎక్కడా కోట్లకు స్ధానం దక్కలేదు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ స్ధానం దక్కలేదనుకోండి అది వేరే సంగతి.
వైసిపిలో సముచిత స్ధానం ?
కష్టకాలంలో కూడ పార్టీని వదలకుండా ఉన్న తనను పార్టీ అధిష్టానం నిర్లక్ష్యం చేస్తోందన్న మనస్ధాపంతో కోట్ల ఉన్నారట. కాంగ్రెస్ లో ఉండి ఉపయోగం లేనపుడు ఇక పార్టీలో కొనసాగాల్సిన అవసరం ఏంటని మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎటూ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇపుడు గనుక సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో కోట్ల కుటుంబానికి రాజకీయంగా ఇబ్బందులు తప్పవని అనుచరులు గట్టిగా చెబుతున్నారట. మద్దతుదారుల లెక్క ప్రకారం కోట్ల కుటుంబం వైసిపిలో చేరితేనే ఉపయోగం ఉంటుందట. జిల్లాలోని డోన్, కర్నూలు, పత్తికొండ నియోజకవర్గాల్లో కోట్ల కుటుంబానికి మంచి పట్టుంది. కెఇ కృష్ణమూర్తి గట్టి ప్రత్యర్ధి టిడిపిలో ఉన్న కారణంగా కోట్ల టిడిపిలో చేరే అవకాశమైతే దాదాపు లేనట్లే. అంటే, ఇక మిగిలింది వైసిపి మాత్రమే అన్న విషయం స్పష్టం.