ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రభుత్వంపై అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి అదరగొట్టేశారు. దాదాపు గంటసేపు మాట్లాడిన రాహూల్ తన ప్రసంగం యావత్తు నరేంద్రమోడినే లక్ష్యంగా చేసుకున్నారు. మోడి ప్రధాని అయ్యిందగ్గర నుండి తీసుకుంటున్న నిర్ణయాలు, జరుగుతున్న అవకతవకలపై దుమ్ము దులిపేశారు. మోడి-అమిత్ షా ధ్వయం వైఖరి దేశానికి ప్రమాదకరమన్నట్లుగా మాట్లాడారు.
మోడిపై రాహూల్ ధ్వజం
ఎన్నికల సమయంలో ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమచేస్తామన్న హామీ దగ్గర నుండి నోట్ల రద్దు, జిఎస్టీ అమలు, రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో అవకతవకలు, చైనా చొరబాట్లు అది ఇది అని కాదు. నాలుగేళ్ళ మోడి పాలనలో జరిగిన అంశాలన్నింటిపైనా రాహూల్ ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవటం, కోట్లాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవటం, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలను ప్రస్తావించారు.
మోడి, షాలు ప్రత్యేక తరహా వ్యక్తులు
మోడి పాలనలో పారిశ్రామిక వేత్తలకు జరుగుతున్న లబ్దిని ఉదాహరణలతో సహా వివరించారు. రుణాలను మాఫీ చేయమని రైతులడిగే సాధ్యం కాదని చెప్పిన ప్రధాని లక్షల కోట్ల రూపాయలు రుణాలను మాత్రం పారిశ్రామికవేత్తలకు ఎలా రద్దు చేశారంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావటం, పోవటం మామూలేనన్నారు. అదే మోడి, అమిత్ షాలు మాత్రం అధికారంలో లేకుండా ఉండలేరంటూ ధ్వజమెత్తారు. వారిద్దరినీ ప్రత్యక తరహా వ్యక్తులంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోసం వారిద్దరూ ఎంతకైనా తెగించే వ్యక్తులుగా మోడి, అమిత్ షాలను వర్ణించారు. మొత్తం మీద రాహూల్ ప్రసంగం యావత్తు చెణుకులతోను, చమత్కారాలతోనే కాకుండా పదునైనా ఆరోపణలు, విమర్శలతో ముగిసింది.