అనంతపురం జిల్లాకుచెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలే సెపరే టు! ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. కొంత సేపు స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తారు. మరికొద్ది సేపు.. `మావాడు` అంటూనే వైసీపీ అధినేత జగన్పై విరుచుకుపడతారు. ఇక, చంద్రబాబుపై పొగడ్తలు కురిపిస్తూనే.. వేదికమీదనే చురకలు అంటిస్తాడు. వారసత్వ రాజకీయాలకు జైకొడతారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అని ప్రశ్నిస్తారు. అదేసమయంలో వారసత్వంగా జగన్కు సీఎం పదవి కావాలంట! అని ఎద్దేవా చేస్తారు. ఇలా తన విభిన్న శైలితో రాజకీయాలు చేస్తున్న జేసీ.. టీడీపీలో సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు తన పార్టీ నేతల మాటలను విన్నది చాలా తక్కువ శాతమే!
కానీ, జేసీ విషయానికి వస్తే.. మాత్రం.. చంద్రబాబు జేసీకి భయపడుతున్నారా? అని అనిపిస్తోంది. జేసీ అలగడం.. బాబు బుచ్చగించడం.. కామన్ అయిపోయింది. 2014 వరకు కాంగ్రెస్లోనే ఉన్న జేసీ కుటుంబం.. ఆ తర్వాత సైకిల్ ఎక్కి.. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్ను కైవసం చేసుకుని గెలుపొందింది. వాస్తవానికి జేసీకి టీడీపీలో అనుభవం తక్కువ. అయినా కూడా.. తనదైన శైలిలో ఆయన రాజకీయాలను నడిపిస్తున్నారు. చంద్రబాబును తన దారిలోకి తెచ్చుకుంటున్నారు. గతంలో ఒకసారి.. తన పదవికి రాజీనామా చేస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. గత ఏడాది మధ్యపెన్నార్ జలాశయం నుంచి ఉత్తర కాల్వ ద్వారా చాగల్లు జలాశయానికి నీరివ్వాలని పట్టుబట్టారు. వాస్తవానికి హెచ్చెల్సీలో చాగల్లు జలాశయానికి ఎటువంటి నీటి వాటా లేదు. అయినప్పటికీ నీటి కోసం ఆయన పట్టుబట్టారు.
అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానంటూ అందుకే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇదే సమయంలో విజయవాడలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ చర్చలు జరిపి, వెనువెంటనే చాగల్లుకి నీరిచ్చేలా అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. దీంతో జేసీ తన రాజీనామా ప్రతిపాదన ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఇక, ఇప్పుడు తాజాగా.. నగరంలో పలు రహదారుల విస్తరణకు జేసీ మొదటి నుంచి పట్టుబడుతున్నారు. ఈ విషయంలో ఎంపీకి, అనంతపురం నగర ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. కొన్నాళ్ల కిందట విస్తరణకు అంతా సిద్ధమైన తరుణంలో, చివరి నిమిషంలో ఆ ప్రక్రియ ఆగిపోయింది.
అప్పటి నుంచి జేసీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో రాంనగర్ వంతెన విషయంలో కూడా ఇలాగే ఉద్దేశ పూర్వకంగా ఎమ్మెల్యే అడ్డుకునే యత్నం చేశారనీ, ఇప్పుడు రహదారుల విస్తరణపైనా అదే ధోరణి అవలంబిస్తు న్నారని జేసీ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే జేసీ పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాననీ, ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కూడా వెళ్లనని మొండికేశారు. దీంతో ఉలిక్కిపడిన చంద్రబాబు.. జేసీ డిమాండ్లలో ఒక్కటైన రహదారుల విస్తరణపై దృష్టి పెట్టారు. జేసీ కోరిన మేరకు రహదారి విస్తరణకు పచ్చ జెండా ఊపారు. దీంతో జేసీ ఢిల్లీ విమానం ఎక్కారు. ఈ పరిణామాలను గమనిస్తున్న సీనియర్లు.. జేసీకి బాబు భయపడుతున్నారా? అని లోలోనే ప్రశ్నించుకుంటున్నారు.