చంద్రబాబునాయుడు పరువును ప్రధనమంత్రి నరేంద్రమోడి సాంతం తీసేశారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో చివరగా మోడి సమాధానమిస్తూ చంద్రబాబును కడిగిపారేశారు. ఇంతకాలం చంద్రబాబు గురించి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలనే ప్రధానమంత్రి కూడా బలపరిచినట్లైంది. అసలు సంఖ్యాబలం లేనపుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రతిపాదించారో అర్దం కావటం లేదంటూ మండిపడ్డారు. మోడి ప్రసంగం మొదలుకాగానే టిడిపి ఎంపిలు స్పీకర్ వెల్ దగ్గరకు వచ్చి ధర్నా చేయటం మొదలుపెట్టారు. అంటే ఏపి విభజన సమస్యలను ప్రస్తావించకుండానే, సమాధానాలు చెప్పకుండానే ప్రసంగం ముగించేస్తారేమో అన్న ఆందోళనతో బహుశా టిడిపి ఎంపిలను వెల్ దగ్గరకు వెళ్ళేలా పురికొల్పిందేమో ? అదే వారి కొంప ముంచింది.
చంద్రబాబు గురించి వివరించిన మోడి
సభలో టిడిపిఎంపిలు చేస్తున్న ఆందోళనను మోడి అవకాశంగా తీసుకున్నారు. చంద్రబాబు గురించి మీకు తెలియని విషయాలను చెబుతాను ముందు మీరు వెళ్లి మీ సీట్లలో కూర్చోమంటూ మోడి ఆదేశించారు. దాంతో ఎంపిలందరూ వెల్ లో నుండి తమ సీట్లలోకి చేరారు. ఇక అప్పుడు మొదలుపెట్టారు చంద్రబాబు పురాణాన్ని మోడి. చంద్రబాబు వ్యక్తిత్వం, అవకాశవాదాన్ని సాంతం బట్టబయలు చేశారు. మోడి చెబుతుంటే టిడిపి ఎంపిల మొహాల్లో నెత్తురు చుక్క కనిపించలేదు.
ప్యాకేజీని స్వాగతించిందే చంద్రబాబు
ప్రత్యేకహోదా డిమాండ్ తోనే ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించుకున్నామని, ప్రత్యేకహోదా డిమాండ్ తోనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించామని చంద్రబాబు చెప్పుకుంటున్నదంతా అబద్దమంటూ మోడి తేల్చేశారు. చంద్రబాబును పచ్చి అవకాశవాదిగా మోడి వర్ణించారు. ప్రత్యేకహోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పినపుడు చంద్రబాబు స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీనే ముద్దంటూ కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖను వివరించారు. ప్యాకేజి ప్రకటించినపుడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్నికల కోసం చంద్రబాబు యుటర్న్
ప్యాకేజి విషయంలో పూర్తి సానుకూలంగా స్పందిచిన చంద్రబాబు హటాత్తుగా యు టర్న్ తీసుకున్నట్లు మండిపడ్డారు. ప్రజల మనోభావాలను గ్రహించే, ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఒత్తిడికి తట్టుకోలేకే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజి నుండి ప్రత్యేక ప్యాకేజి వైపు యు టర్న్ తీసుకున్నట్లు ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు స్టాండ్ మార్చుకున్నట్లు వివరించారు. వైసిపి ఉచ్చులో పడద్దని తాను చంద్రబాబుకు స్పష్టంగా చెప్పానంటూ కుండబద్దలు కొట్టారు.
రాజకీయం కోసమే సభను వాడుకుంటున్నారు
కేంద్రమంత్రులను ఉపసంహరించుకున్నపుడు, ఎన్డీఏలో నుండి బయటకు వచ్చే ముందు తాను చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణ మొత్తాన్ని మోడి లోక్ సభలో వివరించారు. వైపిపి-టిడిపి మధ్య ఉన్న వైరంలో తనను పావుగా వాడుకోవద్దని హెచ్చించినట్లు కూడా చెప్పారు. చంద్రబాబు తన రాజకీయం కోసం రాష్ట్రాన్ని, పార్లమెంటును ఉపయోగించుకుంటున్నట్లు మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణా అభివృద్ధిలో సాగుతుంటే ఏపి ఎందుకు వెనకబడిఉందో గ్రహించాలన్నారు. చంద్రబాబుకు రాజకీయాలు ముఖ్యమంటూ మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో చంద్రబాబుకు హటాత్తుగా ప్రత్యేకహోదా గుర్తుకు వచ్చిందా అంటూ మండిపడ్డారు.
చంద్రబాబు దుమ్ము దులిపేసిన మోడి
మొత్తానికి దాదాపు తన 2 గంటల ప్రసంగంలో మోడి ఎక్కువగా జాతీయ అంశాలనే ప్రస్తావించారు. కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకునే ప్రసంగించారు. మధ్యలో కాసేపు ఏపి అంశాలను ప్రస్తావించినా ఆ కొద్ది సేపు కూడా చంద్రబాబు దుమ్ముదులిపేసేందుచే వినియోగించుకున్నారు. హోలు మొత్తం మీద టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చంద్రబాబు పరువునే తీసేసిందనటంలో ఎటువంటి సందేహం లేదు.