ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబునాయుడు పై వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మళ్ళీ మొదలుపెట్టారు. హోదా డిమాండ్ తో చంద్రబాబు లోక్ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తీర్మానం వీగిపోతుందని అందరికీ ముందే తెలుసు. అయినా హోదా కోసం తానేదో చేసేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకోవటంలో భాగంగానే చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం కూడా వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకే చంద్రబాబు ప్రవేశపెట్టిన విషయం వాస్తవం.
పరువు తీసేసిన మోడి
ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. తీర్మానం వీగిపోవటం ఒక ఎత్తయితే, హోదా ఇవ్వకపోవటాఇకి కారణం చంద్రబాబే అంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే చెప్పటం మరొక ఎత్తు. మొదటి అంశం పక్కనబెడితే మోడి దెబ్బకు చంద్రబాబు పరువు సాంతం పోయింది. జాతీయస్ధాయిలో చంద్రబాబు పలుచనైపోయారు. ఎలాగంటే మద్దతిస్తామని చెప్పిన ఏ ఒక్క పార్టీ కూడా సభలో అసలు ఏపి అంశాన్ని ప్రస్తావించనే లేదు. అదే విషయమై చంద్రబాబును తాజాగా జగన్ నిలదీశారు.
చంద్రబాబుపై మానసిక యుద్ధం
ఇక్కడే చంద్రబాబుపై జగన్ మళ్ళీ ఒత్తిడి పెంచుతున్నారు. చంద్రబాబుపై జగన్ మానసిక యుద్ధం చేస్తున్నట్లే లెక్క. అవిశ్వాస తీర్మానం వీగిపోయన నేపధ్యంలో చంద్రబాబు ఏం చేస్తారనే విషయమై స్పష్టత లేదు. తన మద్దతుదారులతో చంద్రబాబు ఉదయం నుండి మంతనాల్లో ముణిగిపోయారు. అందుకనే ఆ అవకాశాన్ని జగన్ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. టిడిపి ఎంపిలతో రాజీనామాలు చేయించమని జగన్ సూచించటం, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుందామని చెప్పటం మానసిక యుద్దంలో భాగమే.
మళ్ళీ ఉచ్చులో పడతారా ?
మరి జగన్ సూచనను చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటారా ? అనుమానమే. ఎందుకంటే, ఇప్పటికే లోక్ సభలో మోడి మాట్లాడుతూ వైసిపి ఉచ్చులో పడొద్దని తాను చంద్రబాబును హెచ్చించానంటూ చెప్పటం గమనార్హం. అందుకే ఇపుడు మళ్ళీ టిడిపి ఎంపిల రాజీనామాలంటే వైసిపి ఉచ్చులో చంద్రబాబు మళ్ళీ ఇరుకున్నట్లే అని స్పష్టమవుతుంది. రాజీనామాలు చేయకపోతే పదవుల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టినట్లవుతుంది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.