చంద్రబాబునాయుడు వైఖరి ఒక పట్టాన అర్ధం కాదు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినపుడు, జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టాల్సిన సమయంలో విజయవాడలోనే కూర్చున్నారు. తీరా అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత హటాత్తుగా ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకయ్యా అంటే తమకు మద్దతిచ్చిన జాతీయ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపేందుకు, జాతీయ మీడియాను కలిసేందుకట.
ఒక్కపార్టీ కూడా మద్దతు ఇవ్వలేదు
చంద్రబాబు పర్యటనలో ఏమన్నా అర్ధముందా ? ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకున్న పద్దతిగా ఉంది చంద్రబాబు వ్యవహారం. లోక్ సభలో మాట్లాడిన జాతీయ పార్టీల నేతలు కానీ ప్రాంతీయ పార్టీల నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఏపి విషయాలను కానీ ప్రత్యేకహోదా డిమాండ్ ను కాని కనీసం కూడా ప్రస్తావించలేదు. పైగా టిఆర్ఎస్ ప్రత్యేకహోదా విషయంలో కానీండి, చంద్రబాబు వైఖరిపైన కానీండి మండిపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి గంటపాటు మాట్లాడినా అందులో ఒక్క నిముషం కూడా హోదా డిమాండ్ ను ప్రస్తావించలేదు. పోనీ తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని హామీ ఇచ్చారా అంటే అదీ లేదు.
జాతీయ పార్టీల నేతలకు ధన్యవాదాలా ?
రాహూల్ గాంధితో పాటు ఏ ఒక్క నేత కూడా హోదా విషయం మాట్లాడకపోయిన తర్వాత చంద్రబాబు ఎవరికి ధన్యవాదాలు చెబుతారు ? ఎందుకు చెప్పాలి ? అదే సందర్భంలో జాతీయ మీడియాను కలుస్తారట. జాతీయ మీడియాను కలిసి ఏం చెబుతారు ? ప్రత్యేకహోదా డిమాండ్ పై బిజెపి మోసం చేసిందని చెబుతారా ? అలాగే చెబితే మరి నాలుగేళ్ళు బిజెపితో ఎందుకు అంటకాగిన విషయాన్ని జాతీయమీడియా ప్రస్తావిస్తుంది కదా ? జాతీయ మీడియా అంటే జాతి మీడియా కాదన్న విషయం ఢిల్లీలో ఇప్పటికే చాలా సార్లు రుజువైంది కూడా. జాతీయ మీడియా విలేకరులు చాలా సార్లే అనేక సందర్భాల్లో చంద్రబాబు గాలి తీసేశారు. కాబట్టి వారితో ఏం మాట్లాడుతారన్నది ఇప్పటికైతే సస్పెన్సే.
రాజ్యసభలో చంద్రబాబును వదిలేస్తారా ?
కాకపోతే సోమవారం నాడు రాజ్యసభలో కూడా టిడిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై షార్ట్ డిస్కషన్ జరగాలి. ఆ సందర్భంగా జాతీయ నేతల మద్దతు కోరుతారేమో ? లోక్ సభలో చర్చ సందర్భంగానే ఎవరూ మద్దతు ఇవ్వలేదు. ఇక, రాజ్యసభలో మద్దతు ఇస్తారా ? పైగా అది షార్ట్ డిస్కషనే. ఎంత సేపు జరుగుతుందన్నది కూడా అనుమానమే. పైగా లోక్ సభలో చంద్రబాబును దుమ్ము దులిపేసిన మోడి రాజ్యసభలో ఊరికే వదిలిపెడతారా ? ఇంకోసారి పరువు పోగొట్టుకోవటం తప్ప చంద్రబాబుకు ఏమీ ఉపయోగం ఉండదనే అనుకోవాలి. మరి ఇటువంటి పరిస్దితుల్లో ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో చంద్రబాబే వాస్తవాలు చెప్పాలి.