ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ముక్కుసూటి తనం ప్రత్యర్థులకే కాదు.. సొంతపార్టీ నేతలకూ ఎక్కడో గుచ్చుకుంటుంది.. మన, పరాయి తేడా లేకుండా.. ఖరాఖండిగా మాట్లాడే జేసీ.. సరైన సయమంలో బాంబులు పేల్చడంలోనూ దిట్ట.. ఇప్పుడు కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుండగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో దుమారం రేపాయి..ముఖ్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి.. అవిశ్వాసం వీగిపోతుందనీ.. తాను వెళ్లినా.. వెళ్లకపోయినా.. జరగాల్సింది జరుగుతుందని జేసీ పరోక్షంగా ఓటు వేయనని చెప్పడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు.. వెంటనే అనంతపురంలో రోడ్డు విస్తరణకు ఏకంగా రూ.45కోట్లు మంజూరు చేశారు. అంటే.. జేసీ ఓటు ఖరీదు ఇన్ని కోట్లా.. అంటూ పలువురు నాయకులు నోరెళ్లబెడుతున్నారు.
నిజానికి సుమారు రెండేళ్లుగా రోడ్డు విస్తరణ పనుల కోసం నిధులు కావాలని ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అడుగుతున్నారు.. అయినా మంజూరు చేయని చంద్రబాబు మొన్న జేసీ చేసిన వ్యాఖ్యలతో నిధులు విడుదల చేయడం గమనార్హం. అంటే.. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కాకుండా.. ప్రజా అవసరాలతో సంబంధ లేకుండా.. బ్లాక్ మెయిల్ నేతలకే నిధులు విడుదల చేస్తారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇన్ని రోజులు చంద్రబాబు నిధులు ఎందుకు మంజూరు చేయలేదు.. చంద్రబాబు ఫోన్ చేయగానే జేసీ దివాకర్రెడ్డి మనసు మార్చుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే.. ఇదేనని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇప్పుడీ విషయం మీడియాలో వైరల్ అవుతుండడంతో చంద్రబాబుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిధులు ఇలా కూడా మంజూరు చేస్తారనే అని పలువురు అంటున్నారు.
అయితే, రోడ్డు విస్తరణ నిధులు ఆయన సొంతానికి గాకున్నా.. స్థానికంగా మాత్రం మరో టాక్ వినిపిస్తోంది. అనంతపురంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్న ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుందనీ, వాణిజ్య సముదాయాలు ఉంటాయని, వేలాది మంది ఉపాధి పొందుతున్నారని, రోడ్డు విస్తరణతో లాభం కంటే.. నష్టమే అధికంగా జరుగుతుందనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. విస్తరణ అవసరం లేదని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. పలువురు నేతల తీరుతో పార్టీ పరువుపోతోందనీ.. ఇలా నిధులు విడుదల చేయడం వల్ల ప్రభుత్వం ప్రతిష్ట మసకబారుతోందని పలువరు నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన జేసీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై పాత టీడీపీ వర్గాలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.