నరేంద్రమోడి సర్కార్ పై తెలుగుదేశంపార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపధ్యంలో చంద్రబాబునాయుడుపై బిజెపి నేత పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. రోజుకో మాట, పూటకో మాట మాట్లాడే చంద్రబాబును ఎవరు నమ్ముతారంటూ మండిపడ్డారు. వీగిపోతుందని తెలిసి కూడా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటం ద్వారా తెలుగు వాళ్ళ పరువును చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో పడేశారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజిపై చంద్రబాబు ఎన్ని సార్లు మాటలు మార్చింది ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.
చంద్రబాబంటే అసలే మంట
అసలే చంద్రబాబంటే పురంధేశ్వరికి బాగా మంటన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే అవకాశం దొరికనప్పుడల్లా విరుచుకుపడుతుంటారు. దానికితోడు అవిశ్వాసం తీర్మానం సందర్భంగా చంద్రబాబును లోక్ సభలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడి దుమ్ముదులిపేశారు. నిజానికి మోడి ఆ విధంగా మాట్లాడుతారని చంద్రబాబు కూడా ఊహించలేదేమో ? ఎప్పుడైతే మోడి మాట్లాడటం మొదలుపెట్టరో విజయవాడలో చంద్రబాబుకు లోక్ సభలో టిడిపి ఎంపిలకు కత్తివేటుకు నెత్తురు చుక్క లేదన్నట్లైపోయింది.
రైల్వేజోన్ ఇవ్వటం ఖాయమట
మొత్తం మీద చంద్రబాబు పరువు తీసేయటానికి మోడి అవిశ్వాస తీర్మానంపై చర్చను చక్కగా ఉపయోగించుకున్నారు. ఎప్పుడైతే చంద్రబాబుపై మోడి మండిపడ్డారో బిజెపి ఎంపిలు, నేతలు కూడా దాడులు మొదలుపెట్టారు. అందులో భాగంగానే పురంధేశ్వరి కూడా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఇంత చెప్పిన పురంధేశ్వరి ప్రత్యేకహోదా రాదని మాత్రం నేరుగా చెప్పలేదు. కాకపోతే ప్రత్యేకరైల్వే జోన్ మాత్రం కేంద్రం ఇస్తుందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిజానికి ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చే ఉద్దేశ్యం కూడా మోడికి లేదని తేలిపోతోంది. లేకపోతే లోక్ సభలో నే రైల్వేజోన్ ఇస్తున్నట్లు చెప్పేవారే. కాంగ్రెస్ మద్దతుతో చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకు తమ తండ్రి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని అనటం విచిత్రంగా ఉంది. ఎందుకంటే, అదే కాంగ్రెస్ లో చేరి పదేళ్ళుగా ఎంపిగా కేంద్రమంత్రిగా ఎలా అయ్యారో పురంధేశ్వరి చెబితే బాగుంటుంది.
175 సీట్లలోనూ బిజెపి పోటీ చేస్తుందట
సరే ఏదెలాగున్నా నాలుగేళ్ళలో ఏపిలో జరిగిన అభివృద్ధి అంతా బిజెపి చలవేనంటూ తేల్చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే చంద్రబాబు షోకులు చేసుకుంటున్నట్లు ఆరోపించారు. ఏఏ పథకాలకు కేంద్రం ఎంతెంత నిధిలిచ్చింది లెక్కలు కూడా చెప్పారు లేండి. మోడి ఇచ్చిన మద్దతుతో చూడబోతే రానున్న రోజుల్లో బిజెపి నేతలు చంద్రబాబుపై మరింతగా రెచ్చిపోవటం ఖాయంగా తెలుస్తోంది. పనిలో పనిగా రానున్న ఎన్నికల్లో ఒంటిరిగానే 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు బిజెపి పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు.