రాజకీయాల్లో నాయకులు ఎలా స్పందిస్తున్నారో.. వారిపై కామెంట్లు చేసేందుకు నెటిజన్లు వెయ్యిరెట్ల వేగంతో స్పందిస్తు న్నారు. నాయకులు ఎవరైనా సరే.. వారి వ్యవహార శైలే.. నెటిజన్లకు ఇంపార్టెంట్! నేతల వ్యాఖ్యలు బాగుంటే.. ఎంత పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారో.. ఏమాత్రం తేడా వచ్చినా.. అంతే తీవ్రంగా దిబ్బకేసి కొడుతున్నారు. నిన్నటికి నిన్న పార్లమెంటులో కాంగ్రెస్ జాతీయ సారథి.. రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపై నిముషాలు, సెకన్ల వ్యవథిలోనే నెటిజన్లు స్పందించారు. కన్ను కొట్టడం పై కురిసిన కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక, ప్రధాని మోడీని కౌగిలించుకోవడంపైనా నెటిజన్లు తీవ్రస్థాయిలో కామెంట్లు, పోస్టులు చేశారు.
ఇవన్నీ నేతలను అదుపులో పెట్టడానికేనని నెటిజన్లు అంటుంటే.. నాయకులు మాత్రం.. నవ్వు కోడానికేనని తీసిపారేస్తున్నారు. ఇక, ఇప్పుడు ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై నెటిజన్లు కామెంట్లు కుమ్మరిస్తున్నా రు. పవన్ స్వాతంత్ర పోరాట సమయంలో ఉండి ఉంటే.. బాబోయ్!! అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కుమ్మరిస్తున్నా రు. ఇంతకీ ఇలాంటి వ్యంగ్య కామెంట్ల వెనుక అసలేం జరిగిందని చూస్తే.. పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇలాంటి పోస్టులకు కారణంగా కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న పార్లమెంటులో జరిగిన అవిశ్వాసంపై చర్చ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. హోదా విషయంలో తన పోరాటంపై క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్ర విభజనతో నష్టపోయిన ప్రజలకు న్యాయం చేసేవరకూ పోరాటం చేయాలని, ఒకరోజు బంద్తోనో, కాగడాల ప్రదర్శనతోనే సరిపెట్టుకోలేమని పవన్ చెప్పడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అంతేకాదు, నిరంతర పోరాటంలో భాగంగానే జనసేన పోరాట యాత్ర చేపట్టినట్టు చెప్పాడు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి ప్రజల గళాన్ని, హోదాపై పెంచుకున్న ఆశలు, ఆకాంక్షల్నీ ఈ యాత్రలో వినిపిస్తామని పవన్ వెల్లడించాడు. వాస్తవానికి వీర సావార్కర్ మాదిరిగా వీర పవన్ పుట్టుకొచ్చి తమ సమస్యలపై యుద్ధం చేస్తాడని భావించిన ప్రజలకు తాజా ప్రకటన ఉసూరుమనిపించింది.
ప్రత్యేక హోదా కోసం ఇప్పటికిప్పుడు పోరాటం చేస్తే ఫలితం లేదని తేల్చేశాడు. అంతేకాదు, తన ప్రత్యేక హోదా పోరు.. నెలల తరబడి, ఏళ్ల తరబడి సాగుతుందని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పాడు. సో.. ఇలాంటి పవన్ గారిని ఎన్నికల్లో గెలిపిస్తే.. హోదా కోసం ఏటా ఉద్యమాలు చేసుకుంటూనే ఉండాలని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ఇంకానయం.. పవన్ స్వాతంత్ర పోరాటంలో కనుక ఉండి ఉంటే.. భారతీయులు ఇప్పటికీ.. బ్రిటీష్ వారిపై పోరాడుతూనే ఉండేవారని.. ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ వైరల్ అవుతుండడం గమనార్హం.