రాజధాని భూముల రైతుల కోసం పవన్ కళ్యాణ్ పోరాడుతున్న సంగతీ తెలిసిందే. ప్రభుత్వం వీరికి అన్యాయం చేసిందని ప్రభుత్వం మీద కూడా విరుచుకుపడ్డాడు. రాజధాని రైతులు నుంచి భూములను బలవంతంగా లాక్కోవద్దని ఎన్నో సభల్లో ప్రసంగించారు. అయితే ఉండవల్లిలో ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ పలువురు ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. జనసేనాని వ్యాఖ్యల కారణంగా తమ భూముల విలువ పడిపోతోందని వాపోయారు.
పవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాజధాని కోసం ఎక్కువ మంది రైతులు భూములు ఇచ్చారన్నారు. భూములు ఇవ్వని రైతులు రెండు శాతమేనని, వారి కోసం పవన్ వచ్చి రాజధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ పైన పవన్ విమర్శలు గుప్పించారు. తనకు పదిమంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే జగన్లా అసెంబ్లీ నుంచి పారిపోయే వాడిని కాదన్నారు. పోటీ చేసి ఉంటే అసెంబ్లీని ఆపేసేవాడినన్నారు.
ఆయన విజయవాడలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2014లో పోటీ చేసి ఉంటే బాగుండేదని, ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతుగా నిలిచానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడాలని, పోరాడాలన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని జగన్ దుర్వినియోగం చేసుకున్నారన్నారు. ఒకవేళ తాను పోటీ చేసి ఉంటే ఒక్క సీటు రాకున్నా తాను అసెంబ్లీ బయట కూర్చొని నిరసన తెలిపేవాడినన్నారు.