ప్రత్యేకహోదా డిమాండ్ పై ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఇచ్చిన పిలుపుకు అధికార తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమా ? టిడిపి నేతల మాటలు చూస్తుంటే అవుననే అనుకోవాలి. టిడిపి ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, రేపటి బంద్ కు ప్రజల మద్దతుండదంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఒకవైపేమో హోదా కోసం టిడిపి ఎందాకైనా పోరాడుతుందని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. మరోవైపేమో వాళ్ళపార్టీ ఎంఎల్సీనే బంద్ విఫలమవుతుందంటూ చెబుతున్నారు. ఎంఎల్సీ మాటలు చూస్తుంటే వైసిపి బంద్ పిలుపును అధికారపార్టీ వ్యతిరేకిస్తున్నట్లే ఉంది.
ధర్మపోరాటాలెందుకు చేస్తున్నారు ?
కొంత కాలంగా ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా చంద్రబాబే ధర్మపోరాటం పేరుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగసభలు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడ సభ నిర్వహించినా చంద్రబాబు హోదా కోసం మొదటి నుండి పోరాటం చేస్తున్నది తానే అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. అదే సమయంలో ఏపిని కేంద్రం అన్నీ విధాలుగా మోసం చేసిందంటూ మండిపడుతున్నారు. కేంద్రంపై జనాలు నిరసన తెలపాలని, బిజెపికి వ్యతిరేకంగా జనాలు పోరాటాలు చేయాలని పిలుపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఒక్క ఓటు కూడా వేయకుండా చిత్తుచిత్తుగా ఓడించాలంటూ చెబుతున్నారు. చంద్రబాబు చెప్పిందే మొత్తం పార్టీ అంతా ఫాలో అవుతోంది.
మళ్ళీ ట్రాప్ లో పడ్డారంటూ ఎద్దేవా చేస్తారా ?
మరి, ఇన్ని రకాలుగా కేంద్రానికి వ్యతిరేకంగా జనాలను చైతన్యం చేస్తున్న అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఇచ్చిన బంద్ పిలుపుకు మాత్రం ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతోందో అర్ధం కావటం లేదు. అంటే మొన్న లోక్ సభలో వైసిపి ట్రాప్ లో ఇరుక్కుపోయారని స్వయంగా మోడినే చంద్రబాబు గాలి తీసేశారు. దాంతో అప్పటి నుండి ఇటు జగన్ అటు మోడి విషయంలో చంద్రబాబు బాగా గింజుకుంటున్నారు. మళ్ళీ ఇపుడు బంద్ కు సహకరిస్తే మళ్ళీ జగన్ ట్రాప్ లో చంద్రబాబు చిక్కుక్కున్నారంటూ మరోసారి బిజెపి ఎద్దేవా చేసే అవకాశం ఉంది. అందుకనే బంద్ పిలుపును వ్యతిరేకిస్తున్నట్లు కనబడుతోంది. సరే, టిడిపి చెప్పినంత మాత్రాన బంద్ లో జనాలు పాల్గొనకుండా ఉంటారా ?