జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కే ఆయన అభిమానులు షాకిచ్చారు. మామూలుగా అయితే కార్యక్రమం కానీ, బహిరంగసభ కానీ అసలు అభిమానులు పవన్ ను మాట్లాడనీయరన్న విషయం అందరికీ తెలిసిందే. పవన్ మైక్ టెస్టింగ్ అంటూ మైక్ పై రెండుసార్లు కొట్టినా అభిమానుల్లో ఒకటే కేరింతలు, ఈలలు, తప్పట్లతో అదరగొట్టేస్తుంటారు. ఇక, ప్రత్యర్ధులపై పవన్ వ్యాఖ్యలు చేస్తే రెచ్చిపోకుండా ఊరకుంటారా ? అటువంటిది అభిమానాలు పవన్ కే షాకిచ్చారు. అది కూడా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి కామెంట్ చేసినపుడు.
జగన్ నే తప్పు పట్టిన పవన్
ఇంతకీ విషయం ఏమిటంటే, విజయవాడలో అభిమానులతో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఎంఎల్ఏలను సభకు పోనీకుండా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నారని అన్నారు. సభలోకి వెళ్ళి ప్రజా సమప్యలపై పోరాటం చేయాలన్నారు. సభలోకి వెళ్ళి పోరాటాలు చేయకుండా రోడ్లపై తిరగటం ఏమీ బాగాలేదంటూ మండిపడ్డారు.
పవన్ కు ఎదురుతిరిగిన అభిమానులు
వెంటనే అభిమానుల్లో కొందరు పవన్ స్పీచ్ ను అడ్డుకున్నారు. జగన్ చేసిన పనిలో తప్పేమీ లేదన్నారు. సభకు వెళ్ళి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకున్న విషయాన్ని అభిమానులు గుర్తుచేశారు. అసెంబ్లీలో అధికార పక్షం వైసిపి గొంతు నొక్కేసిన విషయం అందరికీ తెలిసిందే కదా అంటూ పవన్ నే నిలదీశారు. అంతేకాకుండా జై జగన్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దాంతో పవన్ బిత్తరపోయారు. ఇక ఆ తర్వాత జగన్ గురించి ఏమీ మాట్లాడలేదు.