వైసీపీ పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల పార్టీ కార్యక్రమాలలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఢిల్లీ వెళ్లారంటే తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు చమటలు పడతాయి అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాల్లో అడుగుపెట్టి అతితక్కువ కాలంలోనే ఢిల్లీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయసాయిరెడ్డి.
ముఖ్యంగా రాజ్యసభలో ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడే తీరు ప్రసంగం ఎంతోమంది ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మధ్యకాలంలో చంద్రబాబుపై తనదైన శైలిలో సెటైర్లు కామెంట్లు చేస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఈ క్రమములో వైసీపీ అధినేత జగన్ విజయసాయిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు.
ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైసీపీ అధినేత జగన్ మోహన్ ప్రకటించారు. ఈ నియామకాన్ని తెలియజేస్తూ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్కు, రాజ్యసభ, లోక్సభ సెక్రటరీ జనరల్కు లేఖను పంపారు. కాగా కొద్దిరోజుల క్రితం ఏపీ ప్రత్యేక హోదా సాధనకై వైసీపీకి చెందిన ఐదుగురు లోక్సభ ఎంపీలు తమ పదవులను త్యాగం చేసిన సంగతి తెలిసిందే.
గతంలో ఈ స్థానంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఉండేవారు. ఎంపీల రాజీనామాల నేపథ్యంలో ఈ స్థానంలోకి విజయసాయిరెడ్డి వచ్చారు. ఈసందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్ తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని రాష్ట్ర హక్కులను కాపాడేలా వ్యవహరిస్తానని పేర్కొన్నారు.