చంద్రబాబునాయుడు మాటలు విచిత్రంగా ఉంటాయి. కిందపడ్డా పై చేయి నాదే అని చెప్పుకోవటంలో తెలుగుదేశంపార్టీ నేతలకు మించిన నేతలు ఏ పార్టీలోనూ లేదనటంలో సందేహం లేదు. అందుకు ఎంపిలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్సే తాజా ఉదాహరణ. ఈరోజు ఎంపిలతో చంద్రబాబు మాట్లాడుతూ, పోయిన ఎన్నికల్లో ఏపికి ప్రత్యేకహోదా ఇస్తానని అప్పటి ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడి హామీని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రధాని అయిన తర్వాత హోదా ఇవ్వకుండా ఏపిని ఏ విధంగా మోసం చేస్తోంది వివరించారు. మోడి మోసాన్ని పార్లమెంటులో అందరికీ తెలిసేట్లు చేయాలని ఆదేశించారు. మోడి మోసాన్ని పార్లమెంటు లోపలే కాకుండా బయట కూడా ప్రపంచానికి చాటి చెప్పాలంటూ గట్టిగా చెప్పారు.
మోడి మోసాన్ని జనాల ముందుంచాల్సిందే
ఇంత వరకూ బాగానే ఉంది. ఏపికి మోడి చేసిన మోసాన్ని జనాల ముందుంచాల్సిందే. అందులో ఏం తప్పులేదు. అదే సమయంలో పోయిన ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బిజెపితో పొత్తు పెట్టుకుని చంద్రబాబు చేసిందేంటి ? ఒకవైపు బిజెపిని మరోవైపు పవన్ కల్యాణ్ ను వేసుకుని రాష్ట్రంలో ప్రచారం చేశారు కదా ? వారిద్దరూ మద్దతు ఇచ్చినా అధికారం దక్కుతుందన్న నమ్మకం కుదరలేదు. అందుకనే రుణమాఫీ అంటూ పే....ద్ద హమీ ఇచ్చారు. రుణమాఫీ హామీలోకి ఒకేసారి రైతులు, డ్వాక్రా సంఘాల్లోని మహిళలు, చేనేతలు చేరిపోయారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలేమయ్యాయ్ ?
అదే సమయంలో రుణమాఫీ చాలదనుకునే ఇంటికో ఉద్యోగమన్నారు. ఇవ్వలేకపోతే ప్రతీ నిరుద్యోగికీ నెలకు 2 వేల రూపాయల భత్యమని హామీ ఇచ్చారు. ఈ హామీలోకి లక్షలాది నిరుద్యోగులు చేరిపోయారు. ఇది కూడా చాలదన్నట్లుగా కాపులను బిసిల్లోకి, బిసిలైన బోయలను ఎస్టీల్లోకి చేరుస్తానంటూ మరో హామీ ఇచ్చారు. పై రెండు హామీలతో లక్షలాది మందిని బుట్టలో వేశారు. ఇవన్నీ చాలవన్నట్లు మతానికో ముచ్చట, కులానికో ప్రామిస్ లు చేసి మొత్తానికి ఏదో అధికారంలోకి వచ్చామనిపించుకున్నారు.
ఇద్దరూ జనాలను మోసం చేశారా ?
అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు గడచిపోయాయి. ఇంకొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలూ వచ్చేస్తున్నాయి. మరి, అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు తన హామీలను ఎంత వరకూ నెరవేర్చారు. నిజంగా చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. హామీని నెరవేర్చని మోడిని మోసగాడని చంద్రబాబు అంటున్నపుడు అదే థియరీ చంద్రబాబుకు వర్తించదా ? ఆ లెక్కన చంద్రబాబు కూడా జనాలను మోసం చేసినట్లే కదా ? ప్రధాని హోదాలో మోడి, సిఎం స్ధాయిలో చంద్రబాబు ఇద్దరూ జనాలను మోసం చేసినవాళ్ళే. మరి, మోసాలు చేసిన వాళ్ళను ఏం చేయాలో జనాలే నిర్ణయించుకోవాలి.