ఏపి రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ సరికొత్త రాజకీయానికి తెరలేపిందా ? రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే అవే అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలతో ఈక్వీ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయటం ద్వారా వచ్చే ఎన్నికల తర్వాత వీలైనంతగా లబ్దిపొందాలనే ఆలోచనలో ఉన్నట్లు అనుమానం వస్తోంది. ఎందుకంటే రెండు పర్టీలను వెనుక నుండి ఏకకాలంలో ప్రోత్సహిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధానమంత్రేమో చంద్రబాబు పాలనను తప్పుపడుతుంటే, కేంద్ర హోంమంత్రేమో చంద్రబాబు నాయుడు తమకు విలువైన మిత్రుడని ప్రకటించటం కొత్త రాజకీయంలో భాగమేనేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఏపికి అన్యాయం చేసింది వాస్తవమే
పోయిన ఎన్నికల్లో ఏపికి సంబంధించి విభజన హమీలను నెరవేరుస్తామని, ప్రత్యేకహోదా ఇస్తామనే హామీలను నరేంద్రమోడి స్పష్టంగా హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పటికి నాలుగేళ్ళయినా ప్రత్యేకహోదా ఇవ్వలేదు, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ విషయంలో కూడా మొండి చెయ్యి చూపింది. సరే, ఇక విభజన చట్టం అమలులో కూడా ఏదో మొక్కుబడి వ్యవహారమే నడిపింది. చంద్రబాబునాయుడు చేతకాని తనం కూడా బిజెపికి బాగా ఉపయోగపడింది.
హోదా పోరాటంలో బిల్డప్ ఇస్తున్న చంద్రబాబు
ఎప్పుడైతే వచ్చే ఎన్నికల్లో ఎదురవ్వబోయే సమస్యను దృష్టిలో పెట్టుకున్నారో వెంటనే చంద్రబాబు మేల్కొన్నారు. హటాత్తుగా బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు. అప్పటి వరకూ ప్రత్యేకహోదా పై చంద్రబాబు వేసిన పిల్లి మొగ్గలు అందరూ చూసిందే. బిజెపితో పొత్తు తెగిపోగానే తానే హోదా కోసం మొదటి నుండి పోరాటం చేస్తున్నంత బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.
ఇద్దరితోనూ ఈక్వీ డిస్టెన్స్ మెయిన్ టైన్
కేంద్రాన్ని చంద్రబాబు అంతలా విమర్శిస్తున్నా, మోడినే నేరుగా లక్ష్యం చేసుకున్నా బిజెపి జాతీయ నేతలు చంద్రబాబు గురించి ఏమీ మాట్లాడటం లేదు. అదే సమయంలో వైసిపి అధ్యక్షుడు జగన్ తో కూడా అదే విధమైన డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. తాజాగా లోక్ సభలో ప్రధానమంత్రి జగన్ కు మైలేజ్ వచ్చేలా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పట్టుమని పది సీట్లలో గెలిచే సత్తా బిజెపికి లేదన్న విషయాన్ని కేంద్ర నేతలు గ్రహించినట్లున్నారు. అందుకనే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపిలతో సమానమైన దూరాన్ని పాటిస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా ఎలాగూ తమ చెప్పు చేతల్లోనే ఉంటారని అనుకున్నట్లున్నారు.
సిఎం పీఠం నిర్ణయించే అవకాశం వస్తుందా ?
కర్నాటకలో మొన్నటి ఎన్నికల్లో ఎదురైన అనుభవం తర్వాతే బిజెపి ఏపి విషయంలో కొత్త ఆలోచన చేసినట్లు సమాచారం. రెండు ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లు సీట్ల సాధనలో ముందున్న విషయం తెలిసిందే. కానీ మూడో స్దానంలో ఉన్న జెడిఎస్ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రయ్యారు. రేపు ఏపిలో కూడా ఒకవేళ టిడిపి, వైసిపిలకు దాదాపు సమాన స్ధాయిలో సీట్లొచ్చినపుడు కేంద్రం నుండి తానే చక్రం తిప్పవచ్చనే ఆలోచనలో బిజెపి కేంద్ర నేతల్లో మొదలైందట. అంటే అప్పుడు తన చెప్పు చేతల్లో ఎవరైతే ఉంటారో వారిని పీఠంపై కూర్చో బెట్టే అవకాశం ఉందన్న మాట. కర్నాటకలో కుమారస్వామి లాగ అధికారంలోకి వచ్చే అవకాశం ఎటూ ఏపిలో లేదన్న విషయం అర్ధమైపోయింది. కనీసం సిఎం పీఠం ఎవరికి దక్కాలో నిర్ణయించగలిగితే చాలన్నట్లు బిజెపి ఆలోచిస్తోందట. మరి కమలనాధుల ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే.