ధార్మిక విషయాల్లో ప్రభుత్వం, రాజకీయాలు జోక్యం చేసుకుంటే పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా మారుతుందో తాజా ఘటనే ఉదాహరణ. ప్రభుత్వం, రాజకీయాలు కలిసి తిరుమల శ్రీవారి దర్శనాన్ని కూడా వివాదాస్పదం చేసేశాయి. చివరకు చేతులు కాలకముందే ప్రభుత్వం మేలుకోవటంతో కొంత వరకూ ఉపశమనం కలిగింది. విషయం ఏమిటంటే, మహాసంప్రోక్షణ సందర్భంగా దర్శనాల నిలపివేత వివాదంపై తిరుమల తిరుపతి దేవస్ధానం వెనక్కు తగ్గింది. వచ్చే నెల ఆగస్టు 11-16 తేదీల మధ్య తిరుమలలో శ్రీవారి దర్శనాలను నిలిపేస్తున్నట్లు టిటిడి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ సుధాకర్ యాదవ్ ఆమధ్య ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. పుట్టా సుధాకర్ యాదవ్ ఛైర్మన్ గా బోర్డు ఏర్పడినప్పటి నుండి ఏదో ఒక అంశం వివాదాస్పదమవుతూనే ఉంది. ఈవిషయంలో కూడా అదే జరిగింది.
తల బొప్పికట్టిన బోర్డు నిర్ణయం
మహా సంప్రోక్షణ సందర్భంగా భక్తులను అసలు తిరుమలకే రానివ్వకూడదని మొదట నిర్ణయించారు. తర్వాత అన్నీ వైపుల నుండి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఉపసంహరించుకున్నారు. శ్రీవారి దర్శనాన్ని మాత్రం ఏడు రోజులు నిషేధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే బోర్డు కొంప ముంచింది. ఎప్పుడైతే శ్రీవారి దర్శనాన్ని ఏడురోజుల పాటు నిషేధించారో సామాన్య భక్తుల నుండి ప్రముఖులు, మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా టిటిడి నిర్ణయంపై మండిపడ్డారు.
భక్తుల అభిప్రాయాలు సేకరించిన టిటిడి
వివాదం తారాస్దాయికి చేరుకున్న సమయంలో చంద్రబాబునాయుడు జోక్యం చేసుకున్నారు. దర్శనం నిషేధం విషయంలో భక్తుల అభిప్రాయాలను తీసుకోవాలని ఆదేశించారు. దాంతో వారంపాటు భక్తుల అభిప్రాయాలను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సేకరించారు. చివరకు మహాసంప్రోక్షణ సందర్భంలో కూడా పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. శ్రీవారి దర్శనానికి మహాసంప్రోక్షణ సందర్భంగా కేవలం సర్వదర్శనం క్యూలైన్లను మాత్రమే అనుమతించనున్నట్లు ఈవో చెప్పారు.
దర్శనం వేళలను ప్రకటించిన ఈవో
11వ తేదీ అంకురార్పణ రోజున 9 గంటలు, 12, 13 తేదీల్లో 4 గంటలు, 14న 6 గంటలు, 15వ తేదీన 5 గంటలు, 16న 4 గంటల పాటు శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. సంప్రోక్షణ సందర్భంగా ఆలయంలో యాగశాల తదితరాల వల్ల భక్తులు తిరిగేందుకు స్ధలం సరిపోని కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. పైన చెప్పిన సమయాల్లో ఎంతమందిని అనుమతించేది టిటిడి ఇంకా ప్రకటించలేదు.