నెల్లూరు జిల్లాలో ఒకపుడు తిరుగులేని నేతగా చెలామణి అయిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలో టెన్షన్ పెరిగిపోతోంది. అదేంటి ఆనం ఇపుడు ఏ పార్టీలోనూ లేరు కదా ? మరి ఎందుకు ఆయనలో టెన్షన్ ? అంటే ఏ పార్టీలోనూ లేనందుకే అట. ఆనం టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరాలనుకున్నారు. అయితే ఫ్యాన్ పార్టీలోకి ఆయన ఎంట్రీ అనుకున్నంత ఈజీగా లేదు. వచ్చే ఎన్నికల్లో ఆనంకు ఎక్కడ టిక్కెట్టు ఇవ్వాలో తేలటం లేదు. అందుకనే ఎంట్రీ ఇంకా ఖాయం కాలేదు. పైగా టిక్కెట్టు కేటాయింపుపై పెద్ద కండీషన్ పెట్టిందట నాయకత్వం. అందుకే ఆనంలో టెన్షన్ పెరిగిపోతోంది.
ఖరారు కాని నియోజకవర్గం
ఇంతకీ విషయం ఏమిటంటే, వైసిపిలో చేరాలని అనుకున్న ఆనం తన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు వైపు మొగ్గుచూపారు. అయితే అక్కడ ఇప్పటికే సిట్టింగ్ ఎంఎల్ఏ మేకపాటి గౌతమ్ రెడ్డి ఉండటంతో ఆ సీటుపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. దాంతో వెంకటగిరిని ఆనం ఎంచుకున్నారు. జగన్ తో జరిగిన భేటీలో అదే విషయాన్ని ఆనం చెప్పారట. అయితే, సీటు విషయంలో జగన్ నుండి స్పష్టమైన హామీ రాలేదట. కారణమేమిటంటే టిక్కెట్టు కోసం ఇప్పటికే అక్కడ ముగ్గురు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అంటే ఆనం నాలుగో నేత అన్నమాట. జగన్-ఆనం మధ్య చర్చలు బయటకు పొక్కటంతో ఒక్కసారిగా వెంకటగిరి రాజకీయం వేడెక్కింది.
పోటీ గట్టిగా ఉంది
పార్టీలో చాలా కాలంగా నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, బెంగుళూరులో పారిశ్రామికవేత్తగా స్ధిరపడిన కలిమిలి రాంప్రసాద్ రెడ్డి చురుగ్గా పనిచేస్తున్నారు. వీరే కాకుండా బిజెపికి రాజీనామా చేసి వైసిపిలో చేరేందుకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనెడ్డి కొడుకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రంగం సిద్దం చేసుకున్నారు. వీరికి తాజాగా ఆనం కూడా తోడయ్యారు. దాంతో వెంకటగిరి నియోజకవర్గంలో వైసిపి మధ్య నాలుగుస్తంబాలాట మొదలైంది.
టిక్కెట్టు కోసం సర్వే
దాంతో పై నలుగురిలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక జగన్ అయోమయంలో పడ్డారట. అందుకనే అభ్యర్ధుల నేపధ్యం, వారి సామర్ధ్యం ఆధారంగా వివిధ మార్గాల్లో సర్వే చేయించేందుకు పార్టీ నాయకత్వం రంగం సిద్దం చేసింది. ఒకవేళ సర్వేలో తనకు అనుకూలంగా ఫలితం రాకపోతే తన గతేమవుతుందో అర్ధం కాక ఆనం రామనారాయణరెడ్డిలో టెన్షన్ పెరిగిపోతోంది.