రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామన్. అయితే,ఒకప్పుడు రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు మధ్య ట్రండ్ మారిపోయింది. గతంలో వ్యక్తిగత విషయాలు, గోప్యత అనుకున్న విషయాలపై నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు కొంత మేరకు ఆలోచించేవారు. అయితే, ఇప్పుడు ఇలాంటి విషయాలనే నేతలు రోడ్లపై తెస్తున్నారు. వాటి ద్వారానే ఎదుటి పక్షం నేతల నోళ్లకు తాళాలు వేస్తున్నాయి. అవతలి పక్షం నేత ఎన్ని తప్పులు చేస్తే.. తమకు అంత పండగ అన్నట్టుగా ఉన్నాయి ప్రస్తుత రాజకీయాలు. ఈ రాజకీయాల్లో ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తామనే వారు కూడా కలిసి పోయారు. ఇక, ఇప్పుడు తాజా విషయానికి వస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్న పవన్ కళ్యాణ్ అందిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఈ విషయంలో ఎవరైనా ఓకే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అయినా, రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనే వారూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పోరాట యాత్రను ముగించుకుని పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్నాడు పవన్. అయితే, ఆయనకు తన అభిమానులు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పోరాట యాత్రకు సంఘీభావంగా జనసేన కార్యకర్తలు చేస్తున్న ర్యాలీలకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోగా, వారిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. బైకుల సైలెన్సర్లను తీసేసిన వాటికి..కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా తాజాగా కాలు బెణికి భీమవరంలో రెస్ట్ తీసుకుంటున్న పవన్ వద్దకు వచ్చారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పవన్. అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.
అదేసమయంలో చంద్రబాబు సహా ఎవరూ ప్రతి విమర్శ కూడా చేయలేని విధంగా పవన్ వ్యాఖ్యలు గుప్పించారు. టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై పరోక్షంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలు బైక్ సైలెన్సర్ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని అన్న పవన్.. మరి ఇంట్లో తుపాకీతో కాల్చి బయట తిరుగుతున్నవారిని మాత్రం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే పవన్ పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు.
2004లో బాలకృష్ణ తన ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిం దని, రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంద ని పవన్ మండిపడ్డారు. అయితే, పవన్ వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు కౌంటర్లు వేసే.. టీడీపీ నేతలు .. బాలయ్యపై పవన్ చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం తేలు కుట్టిన దొంగల్లా మౌనం పాటించడం గమనార్హం.