తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం ఎంఎల్ఏ యరపతినేని అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు నష్టం జరుగుతోందంటూ కోర్టు మండిపడింది. యరపతినేని మైనింగ్ ను అదుపు చేయాలంటూ గతంలోనే ఆదేశాలిచ్చినా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో అర్ధం కావటం లేదన్నది.
అక్రమ మైనింగ్
ఎంఎల్ఏ మైనింగ్ వివరాలు తెలుసుకునేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) ద్వారా విచారణ జరిపించనున్నట్లు హెచ్చరించింది. అక్రమ మైనింగ్ నిలిపేందుకు ప్రభుత్వం, మైనింగ్ డిపార్ట్ మెంటు ఏం చేస్తున్నాయంటూ మండిపడింది. జిల్లాలోని సున్నపురాయి గనులను ఎంఎల్ఏ యధేచ్చగా తవ్వుకుపోతుంటే జిల్లా యంత్రాగమంతా ఏమి చేస్తున్నారో అర్ధం కావటం లేదని ధ్వజమెత్తింది. ఎంఎల్ఏ అక్రమ మైనింగ్ పై వెంటనే జిల్లా యంత్రాంగంతో పాటు ఉన్నతాధికారులు కూడా తమకు నివేదికలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాన ఆదాయవనరు మైనింగే
కోర్టు తాజా ఆదేశాలతో అధికార టిడిపితో పాటు ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, ఎంఎల్ఏ మైనింగ్ యాక్టివిటీ ఈనాటిది కాదు. యరపతినేని ఆర్దిక మూలాలకు ప్రధాన ఆదాయవనరు ఈ మైనింగే అన్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో ఖర్చు పెట్టినా, ఇపుడు చేస్తున్న ఖర్చులకైనా అదే ఆధారం. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ఎంఎల్ఏ తన మైనింగ్ ను మంచి ఊపుతో చేయిస్తున్నారు. ఇటువంటి నేపధ్యంలో హటాత్తుగా కోర్టు సీరియస్ కావటంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది.