ప్రత్యేకహోదాకు సంబంధించి ఒక విషయంలో చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకటైనట్లున్నారు. చంద్రబాబు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య తరచూ ఒకే డైలాగ్ చెబుతున్నారు. అదేమిటంటే వచ్చే ఎన్నికల్లో 25కి 25 ఎంపిలను తమకు ఇస్తే ప్రత్యేకహోదా సాధిస్తామని భీకర ప్రకటనలు చేస్తున్నారు. అయితే, వారి ప్రకటనల్లో నిజమెంత ? మొన్నటి వరకూ చంద్రబాబు ఏమి చేశారు ? అసలు ఏపికి ప్రత్యేకహోదా సాధ్యమేనా ? అనే విషయాలపై ఇపుడు అందరిలోనూ చర్చ జరుగుతోంది.
నాలుగేళ్ళు ప్రయోజనాలే పట్టించుకోలేదు
ఒకసారి చంద్రబాబు విషయం చూద్దాం. పోయిన ఎన్నికల్లో పొత్తుల కారణంగా టిడిపి, బిజెపిలకు 17 ఎంపి సీట్లు వచ్చాయి. అందులో 2 సీట్లు బిజెపిది కాగా మిగిలిన సీట్లు టిడిపివి. కాగా మిగిలిన సీట్లను వైసిపి గెలుచుకున్నది. తర్వాత వైసిపి నుండి గెలిచిన 8 మంది ఎంపిల్లో ముగ్గురుని చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్న విషయం అందరూ చూసిందే. నాలుగేళ్ళపాటు బిజెపి, టిడిపిలు కలిసే కాపురం చేశాయి. కారణాలేవైనా విభజన చట్టం అమలుపై చంద్రబాబు ఏరోజు కూడా కేంద్రప్రభుత్వంపై చిత్తశుద్దితో ఒత్తిడి పెట్టలేదన్నది వాస్తవం. అందులోనే ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ లాంటివున్నాయి.
15 ఎంపి సీట్లంటే చిన్న విషయం కాదు
అదే సమయంలో హోదాపై పోరాటాలు చేసింది ఒక్క వైసిపి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి పోరాటాలు, ఆందోళనల కారణంగా హోదా డిమాండ్ ఇంతకాలం సజీవంగా ఉందన్నది వాస్తవం. జనాలు మూడ్ గ్రహించి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారం అందుకునే వ్యూహంలో భాగంగా ఉన్నపళంగా బిజెపితో కటీఫ్ చెప్పేశారు. అప్పటి నుండి హోదా పోరాటాలు చేస్తున్నది తానే అన్నంతగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు. ఇపుడెక్కడ సభ జరిగినా వచ్చే ఎన్నికల్లో టిడిపికి 25 ఎంపి సీట్లనూ కట్టబెడితే ప్రత్యేకహోదా సాధిస్తా అంటూ చెబుతున్నారు. విచిత్రమేమిటంటే ఇపుడు కూడా టిడిపికి 15 ఎంపిలున్నారు. 15 ఎంపి సీట్లంటే మాటలుకాదు. మరి, ఇపుడే సాధించలేని వ్యక్తి రేపటి ఎన్నికల్లో 25 ఎంపి సీట్లను ఇచ్చినా మాత్రం ఏం సాధించగలరు ?
545 సీట్లలో 25 ఎంపిలెంత ?
ఇక, వైసిపి విషయానికి వస్తే జగన్ కూడా అదే పాట పాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నిజంగానే వైసిపికి 25 ఎంపిలను జనాలు ఇచ్చినా ఏ విధంగా ప్రత్యేకహోదా సాధించగలరో జగన్ చెప్పటం లేదు. నిజానికి 545 ఎంపిలున్న లోక్ సభలో 25 ఎంపిల బలం ఏపాటిది ? పైగా ఏపి ఎంపిల సంఖ్యకన్నా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంపిల సంఖ్య చాలా ఎక్కువ. పై రాష్ట్రాల్లోని ఎంపిల సహకారం లేకుండా ఏపికి ప్రత్యేకహోదా సాధ్యం కాదు.
ఇద్దరి మాటల్లోనూ నిజమెంత ?
ఇప్పటి పరిస్దితులను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మెజారిటీ తగ్గవచ్చేమో కానీ మళ్ళీ ఎన్డీఏనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మళ్ళీ నరేంద్రమోడినే ప్రధానమంత్రయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంది. ఇక, ఏపిలో ఏకపక్షంగా అన్నీ ఎంపి స్ధానాలు ఒకే పార్టీకి వచ్చే అవకాశాలు తక్కువే. అంటే కేంద్రంలో మళ్ళీ మోడి వస్తే ఇప్పటి పరిస్దితే పునరావృతమవుతుందే కానీ ఇంతకన్నా భిన్నంగా ఉండే అవకాశాలు ఉండవు. సో, చంద్రబాబు, జగన్ చెబుతున్నదాంట్లో వాస్తవం లేదన్నది అర్ధమైపోతోంది.